భారత్ శాంతి కాముక దేశమే అయినా, ఇరుగు పొరుగు దేశాలు శత్రువుగా పరిగణిస్తున్న తరుణంలో దేశ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం దేశానికి ప్రాణప్రదమైన అంశంగా మారింది. ఈ విషయంలో కించిత్తైనా, ఇసుమంతైనా భారత్ రాజీ పడబోదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. యుద్ధ విమానాలు, సాయుధ దళాల ఆధునీకరణకు సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పలు రక్షణ రంగ ప్రాజెక్టులకు తాము అధికారంలోకి వచ్చాకే ముందుకు తీసుకు వెళుతున్నామని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.
మేక్ ఇన్ ఇండియా తెచ్చి ఇచ్చిన ప్రోత్సాహంతో దేశీయంగా క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేయటం ప్రారంభించారని అన్నారు. రఫేల్ ఫైటర్ జెట్స్ ఒప్పందా నికి మరియు వాటి ఆధునీకరణ సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో నరేంద్ర మోదీ స్పందించారు. దేశం విషయంలో ఒక స్వాప్నికుడు గా తాను స్వప్నిస్తున్న నవభారత్ లో అవినీతికి చోటు లేదన్న నరేంద్ర మోదీ, అవినీతికి పాల్పడిన వారు ఎంతవారైనా వారిని వదిలిపెట్టబోమని పునరుధ్ఘాటించారు.
న్యూ డిల్లిలో ఎన్సీసీ క్యాడెట్ల ను ఉద్దేశించి గత సోమవారం ఆయన ప్రసంగించారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసం మాత్రమే. అవే మీ బంగారు భవితకు బాటలువేస్తాయి” అన్నారు. గత కాలంలోని వీఐపీ సంస్కృతిని తనప్రభుత్వం సవరించి ఈపీఐ - ఎవిరీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ప్రతీ వ్యక్తి ముఖ్యుడు అన్న సంస్కృతిగా తీర్చి దిద్దామని అన్నారు.
గ్రామాల నుంచి వచ్చి ఎన్సీసీ లో శిక్షణ పొందుతున్న వారిని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా రక్షణ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ భవిష్యత్ లో దేశభద్రతకు తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు దేశ ప్రజలు తమపై భరోసా ఉంచాలన్నారు. మనం నికార్సైన శాంతి కాముకులం అంతేకాదు అంతకు మించి దేశరక్షణ విషయంలో దృఢమైన నిర్ణయాలు తీసుకోవటంలో లేశమాత్రమైన నిర్లక్ష్యం చేయం.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో యువ ఓటర్లు ఓట్లు వేసేలా ప్రోత్సహించాలని వారికి సూచించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నవయువత భారీగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లింగ వివక్షకు తావీయకుండా స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. మహిళలను యుద్ధ విమానాలకు పైలట్ లుగా నియమించామని, నేవీలోని మహిళా దళాలు ప్రపంచాన్ని ఇప్పటికే చుట్టివచ్చాయని తెలిపారు. మిలటరీ సహా పలు కీలక విభాగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ కార్యాచరణ కూడా సిద్ధం చేసిందని వెల్లడించారు.