ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్తో పాటు పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేసి దాదాపు 60 పోస్టులపై తీవ్ర అసభ్యకర కామెంట్లు చేసిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును గుంటూరులో అరెస్టు చేశారు.
తాజాగా... వెంకటేశ్వరరావు మాదిరిగానే షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర కామెంట్లు చేసిన మరొకరిని మంచిర్యాలలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్కు తరలించారు. అలాగే షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసిన మరో ఐదుగురి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ పోలీసుల జోరుతో షర్మిలపై దుష్ప్రచారానికి కుట్ర పన్నిన అసలు నిందితుల్లో వణుకు మొదలైంది. తెర ముందుకు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటే.. తెర వెనుక చక్రం తిప్పిన నిందితులు తామ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతున్నారు. కొందరు పెద్దల సహకారం, ఆజ్ఞల మేరకే ఈ సోషల్ మీడియా దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి దొరికిన నిందితులపై ఐపీసీ సెక్షన్ 509, 67(ఎ) ఐటీ యాక్ట్తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అసలు సూత్రదారుల పాత్రపై విచారించేందుకు నిందితుడిని కస్టడీ కోరారు. నిందితుల్లో వెంకటేశ్వరరావు గుంటూరులోని ఆర్వీఆర్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు.