ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ క్రమంగా క్రియాశీలకంగా మారుతున్నారు. మొన్న సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన అఖిల పక్షానికి పవన్ కల్యాణ్ కూడా వచ్చారు. ఆ సమయంలో ఉండవల్లి చెప్పిన ఓ విషయం విని పవన్ కల్యాణ్ మొహంలో రంగులు మారిపోయాయట.
పవన్ కల్యాణ్ చాలా ఉద్వేగభరితుడయ్యాయట. ఇంతకీ ఉండవల్లి ఏంచెప్పారో తెలుసా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఎంత అడ్డగోలుగా పాస్ చేశారో ఉండవల్లి వివరించారట. ఈ బిల్లుకు అనేక పార్టీలు సవరణలు ప్రతిపాదించాయి.
ఓ బిల్లు పాస్ చేయాలంటే సవరణలపైనా ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. కానీ వందల కొద్దీ సవరణలు ఉన్నా.. అన్నింటినీ రిజెక్ట్ చేయబడినట్టు స్పీకర్ చదువుకుంటూ పోయారట. అంతే తప్ప ఓటింగ్ జరపలేదట. ఇదే విషయాన్ని ఆయా పార్టీలు గగ్గోలు పెడుతూ అడిగారట. కానీ స్పీకర్ అన్నీ రిజక్ట్ అయినట్టూ ప్రకటించేశారు.
తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకంగా కాకపోయినా.. చట్టాలను, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ నిబంధనలు పాటించుకుండా అడ్డగోలుగా విభజించడాన్ని ప్రశ్నించాలన్నదే తన ఉద్దేశమని ఉండవల్లి అంటున్నారు. ఆనాడు పార్లమెంటులో జరిగిన విభజన తీరుపై ఇప్పటికైనా ప్రశ్నించాలని ఆయన చెబుతున్నారు. అదే విషయాన్ని పవన్ కు చెప్పినప్పుడు పవన్ చాలా ఆసక్తిగా విన్నారట. అదీ సంగతి.