పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో వైసీపీ కంటే టీడీపీ ముందుంటోంది. ఇప్పటికే దాదాపుగా సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామనే సంకేతాలను బాబు పంపించారు.అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల పేర్లను..కొందరు కొత్తవారి పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రకాశ్ జిల్లా రాజకీయాల విషయానికి వస్తే.. వైసీపీ నుంచి ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురి పేర్లు వినబడుతుండగా తాజాగా జగన్ సోదరి షర్మిల పేరు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి స్పష్టత లేదు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్ధిగా వైవీ సుబ్బారెడ్డి విజయం సాధించారు. బాపట్ల పార్లమెంటు నుంచి తెలుగుదేశం అభ్యర్ధి శ్రీరామ్ మాల్యాద్రి , నెల్లూరు స్థానం నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి రాజమోహనరెడ్డి గెలుపొందారు. అయితే రానున్న ఎన్నికల్లో అభ్యర్ధులు ఎవరవుతారన్న విషయంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు దాదాఫు ఇక్కడ ఖరారైందనే చెప్పాలి. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే క`తనిశ్చయంతో ఉన్నారు. అందుకోసమే అసెంబ్ల సీట్లకు అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఒకరిద్దరి అభ్యర్థులను మార్చాలని కూడా చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. మాగుంట సూచనను కూడా తెలుగుదేశం పార్టీ ఆమోదించినట్లు సమాచారం. ఇక బాపట్ల పార్లమెంటు విషయంలో కూడా గత ఎన్నికల్లో గెలుపొందిన శ్రీరామ్ మాల్యాద్రే మరోసారి పోటీచేసే అవకాశం ఉంది. నెల్లూరు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ముగ్గురు ఈ సారి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మూడు పార్లమెంట్ సీట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిసారించారు.
ఇదే సమయంలో వైసీపీలో కొంత అస్పష్టత నెలకొంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో తటపటాయిస్తోంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనతోనే వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా కోసం ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక మరో వార్త కూడా ప్రచారం లో ఉంది. అదేంటంటే..టీడీపీ నుంచి ఓ ముఖ్యనేత వలసవచ్చి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ సోదరి షర్మిల పేరు కూడా వినిపిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బాపట్ల పార్లమెంటు అభ్యర్ధి ఎవరవుతారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. .