ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో కంటే ఎక్కువగా ఢిల్లీలోనే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన చేరిన ఆయన ఇప్పుడు విపక్షాలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. మొన్న కలకత్తాలో మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నిన్న ఢిల్లీలో కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన ధర్నాలోనూ పాల్గొన్నారు.
మొన్న ఢిల్లీలో చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షకు కూడా జాతీయ నేతలంతా వచ్చి సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా సమాజ్ వాద్ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ వచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు. వేదికపై ప్రసంగించారు కూడా.
అయితే ములాయం సింగ్ యాదవ్.. ఈ ఘటన జరిగిన రెండు రోజులు కూడా పూర్తి కాకముందే ప్లేటు ఫిరాయించేశారు. చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. మోడీ అంత చెత్త నేత దేశంలోనే లేడని చంద్రబాబు అంటుంటే... ఇంతలోనే మూలాయం సింగ్ యాదవ్ ప్రదాని మోడీని ప్రశంసించడం ఇబ్బందిగా మారింది.
మరోసారి మోడీ ప్రదాని కావాలని కోరుకుంటున్నారని ములాయం సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. మోదీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని అభినందించారు. ఆయన పాలన బాగుందని.. ఆయనను ఎవరు వెలేత్తి చూపలేరని వ్యాఖ్యానించారు. ములాయం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.