తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ శకం నడుస్తోంది. బహుశా తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్యం వచ్చాక ఏ ముఖ్యమంత్రికీ ఇంతటి అనుకూల వాతావరణం ఉండకపోవచ్చు. ఇప్పడు తెలంగాణలో కేసీఆర్ కు ఎదురు నిలిచే నాయకుడే లేడు. కేసీఆర్ ను విమర్శించగల పత్రికలూ కానరావు.
మంత్రివర్గ విస్తరణలోనూ కేసీఆర్ తన మార్కు చూపించారు. కేబినెట్ లో ఒకటి నుంచి పది వరకూ అన్ని స్థానాలు తనవే అని చెప్పకనే చెప్పేశారు. తను కాకుండా మొత్తం 11 మంది మంత్రులు ఉన్నా.. కీలకమైన శాఖలన్నీ కేసీఆర్ తన వద్దే అట్టిపెట్టుకున్నారు.
కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి పారుదల, ఐటీ, పరిశ్రమలు, పట్టాణాభివృద్ధి వంటి శాఖలను కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. గత హయాంలో తన తనయుడు కేటీఆర్ నిర్వహించిన ఐటీ, పట్టాణాభివృద్ధి శాఖలూ ఆయన దగ్గరే ఉన్నాయి. తెలంగాణకు ప్రాణప్రదమైన.. గతంలో హరీశ్ రావు నిర్వహించిన సాగునీటి పారుదల శాఖను కూడా కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు.
వాస్తవానికి ఇవి వేరే వారికి కేటాయించినా తన కనుసన్నులను దాటి ఏ కీలకమైన ఉత్తర్వ్యూలు వెలువడవేమో. అసలు మంత్రివర్గమే లేకుండా.. అంటే టెక్నికల్ గా ఉందనుకోండి.. దాదాపు 3 నెలలపాటు పాలన సాగించిన కేసీఆర్.. ఇప్పుడు ఇన్నిశాఖలు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదుకదా.