భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి(73) అనారోగ్యంతో కన్నుమూశారు. బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. బద్దం బాల్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత. కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. హైదరాబాద్లో బీజేపీని బలోపేతం చేయడంతో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.
మైనారిటీ ప్రభావం ఉన్న ఏరియాలో కూడా ఆయన కాషాయజెండా ఎగరేయగలిగారు. అభిమానులు అందరూ ఆయన్ను గోల్కొండ సింహం అని పిలుచుకుంటారు. ఇటీవల 2018 లో జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరుఫున పోటీ చేసి పరాజయం పొందారు. కార్వాన్ లో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ముస్లిం ఓటర్లు ఎక్కువమంది ఉన్న నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్ధిగా ఆయన రికార్డు సృష్టించారు.
విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.