ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నేతలు వైసీపీని టీఆర్ఎస్తో ముడివేసి మాట్లాడటం ఎక్కువ చేస్తున్నారు. జగన్ ను నేరుగా కాకుండా మోడీతోనో.. కేసీఆర్ తోనో ముడిపెట్టి మాట్లాడటం ద్వారా రాజకీయ లబ్దికి ప్రయత్నిస్తున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు కూడా వీరి ఆరోపణలను పరోక్షంగా నిజం చేస్తున్నారు.
తాజాగా.. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు.. ఏకంగా కేసీఆర్, జగన్ బంధానికి కొత్త భాష్యం చెప్పారు. కేసీఆర్ను చక్రవర్తిగా పోల్చిన ఆయన జగన్ను సామంతరాజుగా వర్ణించారు. అంతే కాదు.. జగన్ లండన్ వెళ్తూ వైసీపీ ఇన్ఛార్జి పదవిని కేటీఆర్కు అప్పగించారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్లో వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారని, నోటీసులు ఇచ్చి ఆస్తులు ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో కేసీఆర్ దుర్మార్గాలు, కుట్రలు చేస్తున్నారని.. మోదీ, జగన్, కేసీఆర్ కలిసి చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 26 పార్టీలను ఏకతాటిపైకి తెస్తే మా దేశభక్తిని శంకిస్తారా? అని ప్రశ్నించారు.
అధికారం ఉందనే మిడిసిపాటు తగదని మంత్రి దేవినేని ఉమా హితవు పలికారు. మీరు మాట్లాడే ప్రతి మాటా మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంది. ఐదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని దేవినేని అన్నారు. అంతే కాదు.. పోలవరంపై కవిత కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి ఉమా అన్నారు.