ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న మూడు పార్టీలు.. విపక్షం వైసీపీ, అధికార టీడీపీ, పవన్ నేతృత్వంలోని జనసేనలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు అనగానే రాజ కీయం వేడెక్కడం ఖాయం. అయితే, ఏపీలో వస్తున్న ఎన్నికల విషయంలో రెండు ప్రధాన పార్టీలు సై ! అంటూ పోరాటా నికి రెడీ అవుతుంటే..మధ్య స్తంగా ఉన్న మూడో పార్టీ జనసేన మాత్రం ఎటు మొగ్గాలో తెలియక సతమతం అవుతోందని కొందరు, లేదు లేదు.. ఇప్పటికే ఈ పార్టీ అమ్ముడు పోయిందని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇప్పుడు జనసేన పైన, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్పైన దృష్టి పెట్టారు.
వాస్తవానికి వచ్చే ఎన్నికలు ప్రతి పార్టీ కి ప్రాణ ప్రదంగా మారిపోయాయి. అధికారంలోకి తిరిగి రావాలని చంద్రబాబు పార్టీ ఆశ పడుతోంది. తాము కనుక తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే.. రాష్ట్రంలో అభివృద్ది కుంటుతుందని, అవగా హన లేని జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడని ప్రత్యక్షంగానే అధికార పార్టీ దుయ్యబడుతోంది. ఇక, ఇదేసమయంలో తగుదునమ్మా అంటూ రాజకీయాలు చేస్తున్న జనసేనాని పవన్ కూడా ప్రత్యక్షంగా వైసీపీపైనా.. పరోక్షంగా టీడీపీపైనా విమర్శలు చేస్తున్నారు. అయితే, ఎలా విమర్శలు చేసినా.. చంద్రబాబుకు పరోక్షంగా మద్దతిస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజల్లో ఎక్కువ భాగం చర్చించుకుంటున్నారు.
ఇక, ఈ మూడు పార్టీల ఎన్నికల ప్రచారానికి వస్తే. చంద్రబాబు ఢీ అంటే ఢీ అంటూ.. వైసీపీపీపై విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే.. నేరుగా అది ప్రధాన నరేంద్ర మోడీకి వేసినట్టేనని ప్రచారం చేస్తున్నారు. అయితే, అదే సమయంలో వైసీపీ ప్రచారం మాత్రం విచిత్రంగా ఉంది. ప్రధానిగా ఎవరున్నప్పటికీ.. గత పద్ధతులకు భిన్నంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పనిచేసే ప్రధానికి తాము మద్దతిస్తామని జగన్ ప్రకటించారు. పార్టీ నుంచి ఒక్కరు వెళ్లిపోతేనే నానా హంగామా చేసిన టీడీపీ.. వైసీపీ నుంచి మాత్రం ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించడంపై ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇలా ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడడం గమనార్హం.