ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కొంత కాలంగా ప్రపంచ దేశాల్లో ఉగ్రమూకలు రెచ్చిపోయి దాడులు చేస్తూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. భారత దేశంలో సైనికులను లక్ష్యంగా చేసుకొని ఇప్పటి వరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్నో దాడులు చేశారు..ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ఈ మద్య పుల్వామలో ఉగ్రవాదులు తెగబడి సైనికులపై దాడి చేయగా నలభై మంది జవాన్లు అమరులయ్యారు.
దాంతో భారత్ ప్రతిదాడికి తెగబడింది..పాక్ ఆక్రమిత ప్రాంతాలపై భారత వైమానిక దళం ఒక్కసారిగా దాడులు నిర్వహించి 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దాంతో పాకిస్థాన్ ఉక్రోషంతో భారత్ పై వైమానిక దాడులకు తెగబడగా ఇక్కడి సైన్యం దాన్ని తిప్పికొట్టింది. కాగా, భారత సైనిక స్ధావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడంతో వాటిని తిప్పికొట్టేందుకు మిగ్ 21 యుద్ధ విమానంలో అభినందన్ వెళ్లారు. అయితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూలిపోవడంతో... పాకిస్తాన్ సైన్యం అభినందన్ను అదుపులోకి తీసుకుంది.
అయితే జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలను బేషరతుగా స్వదేశానికి పంపాలని భారత్తో పాటు అంతర్జాతీయ దేశాలు పాక్పై ఒత్తిడి తీసుకురావడంతో అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభినందన్ ని భారత్ కు అప్పగించడంపై పాకిస్థాన్ లో కొందరు పెదవి విరుస్తున్నారు.
ఆయన్ను భారత్ కు అప్పగించకుండా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ కొందరు పాకిస్థాన్ లోని పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను తిరిగి భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. దాంతో భారత్ కి అభినందన్ రావడానికి లైన్ క్లీయర్ అయ్యింది. నేడు సాయంత్రం 4 గంటలకు అభినందన్ విడుదల అవుతున్నట్లు సమాచారం.