ఏపీ సీఎం చంద్రబాబుకు జాతీయ స్థాయిలో పరపతి ఉంది. ఆయన పిలుపు ఇస్తే చాలా పార్టీల నాయకులు స్పందిస్తారు. మొన్న ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షే అందుకు ఓ ఉదాహరణ . అంతటి స్థాయి ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పరువును ప్రతిపక్షనేత జగన్ జాతీయ స్థాయిలో తీసేశారు.
ఇండియా టుడే సంస్థ నిర్వహించిన ఇండియా కాన్క్లేవ్ లో పాల్గొన్న జగన్.. చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను తన బ్లాక్ మనీతో కొంటూ ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని జాతీయ మీడియా ముందు ఢంకా భజాయించారు.
ఇలా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన సీఎం.. ఇలాంటి నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆ టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతే అని ఫోరెన్సిక్ పరీక్షలో కూడా తేలిందని.. అయినా ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. దీనిపై చంద్రబాబు పై ఎలాంటి కేసు నమోదు కాలేదని.. కాబట్టి వాస్తవం ఏమిటన్నది మేధావులంతా ఆలోచించాలని జగన్ అన్నారు.
అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనేది పెద్ద కుంభకోణం అన్నారు జగన్. చంద్రబాబు 2014 జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసు. కానీ అక్కడ, ఇక్కడ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. సరిగ్గా రాజధాని ఏర్పాటయ్యే చోట సొంత హెరిటేజ్ కంపెనీ పేరుతో, బినామీల పేరుతో అక్కడి రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఇండియా టుడే సంస్థ ఇంటర్వ్యూలో జగన్ చెప్పారు.