రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా గుర్తింపు సాధించిన ఏపీలో రాజకీయ గందరగోళం ఏర్పడిందా? ఎన్నికలకు సమ యం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల మధ్య ఓ విధమైన శూన్యత తెరమీదికి వచ్చిందా ? అత్యంత కీలకమైన ఎన్నికలు గా చెప్పుకొంటున్న 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రధానంగా మూడు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అధికార టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రజలకు ఏ ఇష్టమో? ప్రజలు ఏం కోరుతున్నారో? తెలుసుకుని అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదాను పట్టుకుని వేలాడారు. ఈ నేపథ్యంలో హోదా ఇస్తానన్న కాంగ్రె స్తో చెలిమికి కూడా సిద్ధమయ్యారు. హోదా కోసం ధర్మపోరాట దీక్ష అంటూ అనేక పోరాటాలు చేశారు. మరోపక్క, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి నినాదంతో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు ఏదో ఒకటి అందిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లి.. వారిలో ఆనందం వ్యక్తమైతే.. ఇక, తమదే గెలుపు- అని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆయా కార్యక్రమాలకు మంచి ఊపు వచ్చింది. ప్రజల్లోనూ చైతన్యం వచ్చింది. దీంతో ఇంకేముంది టీడీపీ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. దాదాపు గెలిచి నంత ఆనందంలో మునిగిపోయారు.
అయితే, అనూహ్యంగా ఇక్కడ యూటర్న్ ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని భావిస్తున్న అధికార టీడీపీ నుంచి సిట్టింగులు, టికెట్ ఆశావహులు వరుస పెట్టి వైసీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు వైసీపీలో ఆశలు చిగురిస్తున్నాయి. టీడీపీవైపు బలంగా ఉన్న ఆశల పల్లకీలు ఒక్కసారిగా వైసీపీ వైపు వాలాయి. ఇక్కడ ఓ పది మంది నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలో కొత్త ఊపు కనిపిస్తోంది. పార్టీలో చేరుతున్న నాయకులు కూడా ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని కోరుకుంటున్నారని, అందుకే తాము ప్రజా నాడి మేరకు వైసీపీలోకి జంప్ చేస్తున్నామని, జగన్ అధికారంలోకి రావడం తథ్యమని అంటున్నారు. ఇలా ఈ రెండు పార్టీల్లోనూ అధికార పీఠం నువ్వా-నేనే అనే రగడకు ఓ అరుదైన ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఎవరు విజయం వరిస్తారో చూడాలి.