తెలంగాణ రాష్ట్ర సమితిలో కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్యపోరు ఉంటుందని ఓ టాక్ ఉంది. ఇటీవల కేటీఆర్ ను టీఆర్ఎస్ చీఫ్ ను చేయడంతో ఇక కేటీఆర్ దే పైచేయి అని తేలిపోయింది. హరీశ్ రావు ఏం చేస్తారోనని కొందరు ఎదురు చూశారు. కానీ ప్రస్తుతానికి హరీశ్ రావు పార్టీలోనే ఇమిడిపోయే ప్రయత్నమే చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ హరీశ్ రావుకు ఓ సవాల్ విసరడం ఆసక్తిరేపుతోంది. ఇంతకీ ఆ సవాల్ ఏంటంటారా.. తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటరీ ఎన్నికల్లో మెదక్ లో ఎక్కువ మెజార్టీ వస్తుందా? కరీంనగర్ లో ఎక్కువ మెజార్టీ వస్తుందా అన్నదే ఈ సవాల్ .
మెదక్ లో కన్నా కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలోనే అదిక మెజార్టీ తెస్తామని కెటిఆర్ సరదాగా హరీశ్ రావుకు సవాల్ విసిరారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో వీరిద్దరూ మాట్లాడారు. తనకు బావతో ఎలాంటి విబేదాలు లేవని, దీనిపై ఎలాంటి ప్రచారాలు నమ్మవద్దని కెటిఆర్ అన్నారు.
పోటీ ఉన్నదంతా ఒకరితో ఒకరు మెజార్టీలు సాధించే దానిమీదే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కన్నా మేమే ఒక ఓటు అయినా ఎక్కువ తెచ్చుకొని మీ కంటే ముందుంటాం.’ అని కెటిఆర్ అన్నారు. తన సవాల్ బావతో కాదన్న కేటీఆర్ ... తాను, బావ కలిసే ఉన్నామని, ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు.