కృష్ణా జిల్లా రాజధానిగా ఉన్న బందరు(మచిలీపట్నం) నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ అధికార టీడీపీ నుండి మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి బరిలోకి దిగుతుండగా...వైసీపీ నుండి సీనియర్ నేత పేర్ని వెంకట్రామయ్య(నాని) పోటీలో ఉండనున్నారు.అయితే తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో ఇరు పార్టీల నేతలు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పోర్టు పనులు ప్రారంభించడం వంటివి తన గెలుపుకి కలిసొస్తాయని కొల్లు భావిస్తుండగా...ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకిత, మంత్రి మీద అవినీతి ఆరోపణలని పేర్ని నాని  క్యాష్ చూసుకోవాలని చూస్తున్నారు. అలాగే ఎన్నికల ముందే పోర్టు పనులు మొదలుపెట్టడం కేవలం ఓట్ల కోసమే అని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లనున్నారు.


ఇక ఏది ఏమైనా పార్టీల గెలుపు ఓటములపై బందరు పోర్టు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అసలు 2004లో పోర్టు హామీతో, వైఎస్ ప్రభావంతో ఇక్కడ పేర్ని గెలిచారు. ఆ తర్వాత 2008లో పోర్టుకి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. దీంతో 2009లో మళ్ళీ పేర్ని గెలిచారు. కానీ తర్వాత వైఎస్ మరణం, రాష్ట్ర విభజన లాంటి అంశాలతో పోర్టు వెనక్కి వెళ్లింది. ఇక 2014లో పోర్టు హామీతో టీడీపీ నుండి కొల్లు రవీంద్ర గెలిచి మంత్రి అయ్యారు. ఇక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోర్టు పనులు ప్రారంభించారు. మరి ఈ తరుణంలో ప్రజల ఎవరి వైపు ఉంటారో తెలియాలి.


ఇదిలా ఉంటే బందరులో పవన్ కల్యాణ్‌కి ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. దీంతో ఇక్కడ జనసేన తరుపున నిలబడే అభ్యర్ధులకి కూడా ఎక్కువగానే ఓట్లు పడే అవకాశం ఉంది. జనసేన తరుపున స్థానిక నేత లంకిశెట్టి బాలాజి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ జనసేనకి గెలిచే బలం లేకపోయిన ఆ పార్టీ చీల్చే ఓట్ల ప్రభావంతో గెలుపు ఓటములు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇలానే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం కాంగ్రెస్‌లో లాభించింది. ఇక 2014లో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్ధతు ఇవ్వడంతో కొల్లు 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేసే ప్రభావం వలన టీడీపీకి నష్టం కలిగి వైసీపీకి కలిసిరావొచ్చు. ఏది ఏమైనా బందరులో ఈ సారి గట్టి పోటీ జరగనుంది. మరి చూడాలి ఈసారి బందరు ఎవరి ఖాతాలో పడుతుందో


మరింత సమాచారం తెలుసుకోండి: