మహరాష్ట్రలో ప్రధాన రాజకీయవేత్త శరద్ పవార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాదు కేంద్రంలో అనేకసార్లు మంత్రి పదవులు అలంకరించారు. వ్యక్తిగా శరద్ పవార్ శక్తి మంతుడైన రాజకీయవేత్త. అనేక దశాబ్ధాలుగా బారామతి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అయితే ఆయన లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత తెలిపారు.
దీంతో మహారాష్ట్రలోని మధా లోక్సభ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. ఓటమి భయంతోనే పోటీకి దూరంగా ఉన్నారా? అన్న ప్రశ్నను ఆయన కొట్టిపారేశారు. వరుసగా 14 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయమా? అని ఎదురు ప్రశ్నించారు.
తన కుటుంబం నుంచి మేనల్లుడు అజిత్ పవార్, మరో కుటుంబ సభ్యుడు ఎన్నికల బరిలో ఉన్నందున పోటీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్టు పవార్ తెలిపారు. ఒకవేళ వారిద్దరూ పోటీ చేయక పోతే తాను పోటీలో ఉంటానని గత నెలలో శరద్ పవార్ వెల్లడించారు. అయితే వారిద్దరి పోటీ ఖరారు కావడంతో శరద్ పవార్ తప్పుకోవడానికే నిర్ణయించుకున్నారు.
కాగా, గతంలో 2012 ఎన్నికల సమయంలోనూ మొదట తాను పోటీ చేయనని చెప్పిన పవార్ ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. పార్టీ వర్గాలు కూడా ఆయన తాజా నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే శరద్ పవార్ ప్రధానమంత్రి రేసులో నిలిచే అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో శివసేన, బీజేపీలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్తో కలిసి ఎన్సీపీ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రస్తుత నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాలేరని ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. నిన్న మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లను బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి మోదీ ప్రధాని పదవిని చేపట్టం సాధ్యం కాదని అన్నారు.
బీజేపీ పెద్ద పార్టీగా అవతరించి, ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే, ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అవుతుందని, మోదీని ప్రధానిగా చూసేందుకు అవి సిద్ధం గా లేవని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిపై మార్చి 14, 15 తేదీల్లో మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి నుంచి చిన్న పార్టీలు తప్పుకోవడం పై స్పందించిన ఆయన, కొన్నిపోతే, మరికొన్ని వచ్చి కలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ నుంచి హామీ లభిస్తే, పీడబ్ల్యూపీ, స్వాభిమాన్ షెట్కారీ సంఘటన్ వంటి పార్టీలు కలుస్తాయని అన్నారు.
మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో 45 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన శరద్ పవార్, ఆయన తప్పుగా మాట్లాడారని మొత్తం సీట్లు వారే గెలుధిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శరద్ పవార్ ప్రకటించిన మర్నాడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి 2012 నుంచే పవార్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, మళ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్టు గత నెలలో పవార్ ప్రకటించి ప్రకంపనలు రేపారు. అంతేకాదు, ఆయన ఎన్నికల్లో పోటీచేస్తే తన సీటును వదులకుంటానని నైరుతి మహారాష్ట్రలోని మాధా ఎంపీ విజయ్ సింహ మోహతే పాటిల్ ఆఫర్ ఇచ్చారు.
కానీ, కుటుంబ ఒత్తిళ్లతో తన మనసు మార్చుకున్నానని, ఎన్నికల్లో పోటీచేయబోనని శరద్ పవర్ మళ్లీ మాట మార్చారు. ఇక, ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగునుంది. ఫలితాలు మే 23న వెల్లడికానున్నాయి.