ఉత్తర్ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48) తర్వాత దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు కలిగిన పశ్చిమ బెంగాల్ (42) లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కమల నాథులు వ్యూహాలు పన్నుతున్నారు. లెఫ్ట్-పార్టీ ప్రాభవం కోల్పోవడంతో ఏర్పడిన రాజకీయ అస్థిరతను శూన్యతను భర్తీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. విడతల వారీగా ఎన్నికలు జరిగే బెంగాల్లో 20 చోట్ల గెలుపే లక్ష్యంగా కాషాయ పార్టీ బరిలోకి దిగుతోంది.
దేశవ్యాప్తంగా బిజేపి తన వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యంగా బిజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్ పై దృష్టి పెట్టినట్లు కనిపీస్తుంది. ప్రత్యేకించి సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల అనంతరం ఆమెపై బాగానే ఫోకస్ చేస్తున్న ధాఖలాలు దాని పరిణామాలు టిఎంసి ముఖ్యనాయకులు బిజేపిలోకి వలసల పర్వం పెరగటమే ఒక ఋజువు.
జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని లోక్సభ ఎన్నికలు పతాక స్థాయికి చేర్చాయి. దీదీ గడ్డపై తమ ప్రతాపం చూపాలని మోదీ, షా ద్వయం నిర్ణయించుకుంది. ఆ వైపుగా బీజేపీ తన అడుగుల్ని ముమ్మరం చేసింది. దీని కోసం పాక్పై జరిపిన వాయు సేన దాడులు, కులం, స్థానిక గుర్తింపు, జాతీయత, శరణార్థుల సమస్యలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రయోగించనుంది. ఈ దిశగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం అక్కడి శ్రేణుల్ని సమాయత్తం చేసింది.
బెంగాల్లో 20 సీట్లను దక్కించుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడుగా ఉన్న 6 సీట్లు, గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న మరో ఆరు స్థానాల్లో కులాన్ని ఆయుధంగా వాడుకోవాలని కాషాయ పార్టీ ఆలోచిస్తోంది. మిగిలిన 8 నుంచి 9 స్థానాల్లో స్థానికత, శరణార్థుల సమస్యలు, విభజన హక్కుల ప్రస్తావనతో ఆధిక్యం సాధించాలని చూస్తోంది. బలహీనపడ్డ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన చిన్న చిన్న నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టనుంది బీజేపీ.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ కు
ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ముఖ్య నాయకుడు, భత్పరా ఎమ్మెల్యే అర్జున్ సింగ్ గురువారం
బీజేపీ లో చేరారు. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ తో ఢిల్లీలో భేటీ అయిన అనంతరం సీనియర్
నాయకుల సమక్షంలో ఆయన భాజపా కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు తృణమూల్ బహిష్కృత నేత,
బోల్పూర్ ఎమ్మెల్యే అనుపమ్ హజ్రా, సీపీఎం నాయకుడు ఖగేన్ మెర్ము కూడా బీజేపీ తీర్థం
పుచ్చుకున్నారు.
అనంతరం అర్జున్ సింగ్ మాట్లాడుతూ, డబ్బులు ఇస్తేనే తృణమూల్ కాంగ్రెస్ లో మనుగడ సాధించ గలమని టిఎంసి పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని విమర్శించారు. "నేను 40 ఏళ్లుగా మమతా జీ దగ్గర పనిచేశాను. కానీ బాలాకోట్ లో వైమానిక దళం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో భారతసైన్యం విశ్వసనీయతనే ఆమె ప్రశ్నించడం నన్ను కలచివేసింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటై మాట్లాడుతుంటే మమతా జీ మాత్రం, మెరుపు దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏమిటని? అడగటం నిజంగా దురదృష్ట కరం. ఈరోజు బీజేపీ లో చేరడం చాలా సంతోషంగా ఉంది" అని అర్జున్ సింగ్ వ్యాఖ్యానించారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అర్జున్ సింగ్ ఈసారి లోక్సభ బరిలో దిగాలని ఆశించారు. ఈ మేరకు గతంలో తాను ఓటమి చవిచూసిన, బారక్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. నియోజకవర్గం లోని దాదాపు అన్ని శాసనసభ స్థానాల్లో పట్టు ఉన్న అర్జున్ సింగ్, సిట్టింగ్ ఎంపీ దినేశ్ త్రివేది పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపి ఆ స్థానం నుంచి టికెట్ తనకే కేటాయించాలని మమతను కోరారు. అయితే అందుకు నిరాకరించిన మమత ఆ టికెట్ ను దినేశ్ కు కేటాయించారు. పార్టీ ముఖ్య నేతగా ఉన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన అర్జున్ సింగ్ బీజేపీ లో చేరినట్లు తెలుస్తోంది. ఒక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.
యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అనుచరుడు టామ్ వడక్కన్ ఇప్పటికే బీజేపీ లో చేరగా, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యనేత అర్జున్ సింగ్ కూడా కాషాయ కండువా కప్పుకోవడంతో మరిన్ని చేరికల కోసం అమిత్ షా తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం.