చల్లని విశాఖ ఉత్తర నియోజకవర్గం తీరం రాజీకీయ సమీకరణంతో వేడెక్కిస్తోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ..ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి గత సంవత్సరకాలంగా పార్టీ కార్యక్రమాలతో జనంలో కదలాడుతూ కనిపిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేకే రాజు ...అధికార పక్షం నుంచి బలమైన నాయకుడు మంత్రి గంటా శ్రీనివాసరావులు బరిలో ఉండటంతో ఈ నియోజకవర్గంలో గెలిచేదెవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్గా టాక్ నడుస్తోంది. గత దశాబ్ధకాలంగా ప్రాతినిధ్యం కోల్పోయిన నియోజకవర్గం నుంచి.... ప్రతీ ఎన్నికల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని వదులుకుంటూ వస్తూనే విజయాలను తన వెంట వేసుకుని వెళ్లే గంటా పోటీ చేస్తుండటమే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా గంటా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే టీడీపీ ఇక్కడ బలంగా ఉన్నా 2009లో ఓటమి పాలైంది. అలాగే 2014లో పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవడంతో టీడీపీ మద్దతుతో విష్ణుకుమార్రాజు విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఇక్కడ టీడీపీకి నియోజకవర్గ ఇన్చార్జి లేకపోవడం గమనార్హం. విష్ణుకుమార్ ప్రతిపాదనతో చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిని నియమించలేదు. బీజేపీతో చెడిన నాటి నుంచి నియోజకవర్గంపై టీడీపీ అధిష్ఠానం ఈ స్థానంపై దృష్టి సారిస్తూ వస్తోంది. పార్టీ క్యాడర్ బలంగా ఉన్నప్పటికి నాయకత్వ కొరత అయితే కనబడింది. అయితే వారం రోజుల క్రితం ఇక్కడి నుంచి పోటీ చేయాలని గంటాను చంద్రబాబు ఆదేశించడంతో శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది.
వాస్తవానికి ఇక్కడి నుంచి మంత్రి లోకేష్బాబు పోటీ చేస్తారాని మొదట ప్రచారం బలంగా జరిగింది. అటు తర్వాత ఆయన మంగళగిరి నుంచి ఖాయం కావడంతో గంటా సిట్టింగ్ స్థానం భీమిలిని వదిలి ఇక్కడి నుంచి చేసేందుకు సిద్ధపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా రాజు, అధికార పార్టీ బలమైన నేతగా, అభ్యర్థిగా గంటా ఎవరికి వారు ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఇక్కడ ఎవరూ గెలచిన కొత్త చరిత్రే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎవరికీ వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుని బీజేపీ ఏం తక్కువ కాదు అని నిరూపించుకోవాలని ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు సైతం భావిస్తున్నారట. ఇక వైసీపీ బోణి కొట్టాలని దాదాపు ఏడాది క్రితం నుంచే నిశితంగా పావులు కదుపుతూ వచ్చింది. నియోజకవర్గంలో పోయిన పట్టును తెచ్చుకునేందుకే గంటాలాంటి ఘనమైన నేతను టీడీపీలోకి బరిలోకి దింపడం విశేషం. ఇలా విశాఖ ఉత్తరంలో ఉత్కంఠ కలిగించే రాజకీయ పోరు నెలకొంది.