గుడివాడ నియోజకవర్గం... ఇప్పుడు ఏపీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నిక ఇది. రాష్ట్రం మొత్తం మీద కీలక నియోజకవర్గాల్లో ఇది..ఇక్కడ కొడాలి నాని వరుసగా ఇప్పటికే మూడు సార్లు గెలిచి.. నాలుగోసారి బరిలో నిలుచున్నారు.
మొదటి రెండు సార్లు టీడీపీ తరుపున గెలిచిన కొడాలి నాని గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీలో నిలిచి గెలిచాడు. ఈసారి మళ్లీ వైసీపీ తరపునే బరిలో ఉన్నారు. ఆయనపై టీడీపీ ఈసారి దేవినేని అవినాశ్ను పోటీకి దింపింది. ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కొడాలి నాని.. తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమేం చేస్తానో ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. 1983లో ఎన్టీఆర్ కలలుగన్న గుడివాడ రింగ్ రోడ్డు ప్రాజెక్టును తాతను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
గుడివాడకు రింగ్ రోడ్డు అవసరం ఉందని... 1983లోనే ఎన్టీఆర్ భావించారని.. కొడాలి నాని గుర్తు చేశారు. ఆ తర్వాత 21 ఏళ్లకు తాను 2004లో మొదటి సారి అయ్యానని నాని అన్నారు. ఈ పదిహేనేళ్లలో కూడా ఈ ప్రాజక్టు సాకారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దమ్ము- ధైర్యం తనకే ఉన్నాయని నాని గర్వంగా చెప్పారు.
ఈ సారి తమ పార్టీ అధికారంలోకి వస్తే జగన్తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి.. నిధులు తెప్పించి.. భూసేకరణ చేసి.. గుడివాడకు రింగ్ రోడ్డు తప్పకుండా ఏర్పాటు చేయిస్తానని కొడాలి నాని మాట ఇచ్చారు.ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి రాకపోతే మాత్రం తానేమీ చేయలేనని.. చంద్రబాబు సర్కారు అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి లేదని నాని అన్నారు.