మంత్రి కాల్వ శ్రీనివాసులు. జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. టీడీపీలో చక్రం తిప్పుతున్నారు. అనంతపురం జిల్లా రాయ దుర్గం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన కాల్వకు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశం కల్పించారు. నిజానికి అనంతపురం రాజకీయాలు అంటేనే దూకుడుగా ఉంటాయి. మాటకు మాట-ఇక్కడి నేతల స్వభావం. అయితే, కాల్వ విషయానికి వస్తే.. మాత్రం ఆయన చాలా మృదు స్వభావి. సౌమ్యుడు. వ్యక్తిగతంగా ఆయనకు ఇది మంచి పరిణామమే. కానీ, నియోజకవర్గం పరిధిలో మాత్రం ప్రజలు ఈ సౌమ్యత్వం కన్నా కూడా తమకు దూకుడుగా ఉండి... పనులు చేసి పెట్టే నాయకుడు కావాలని కోరుతున్నారు. పైగా అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన కాల్వకు చంద్రబాబు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు.
దీంతో నియోజకవర్గం ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ తలరాతలు మారతాయని ఆశించారు. కానీ, ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా మారింది పరిస్థితి. సాగు, తాగునీటికి ఇక్కడి ప్రజలు వర్షాకాలంలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, ఉపాధి కోసం వలసపోయి.. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యాయి. ఈ పరిస్తిని మార్చేందుకు కాల్వ పెద్దగా ప్రయత్నాలు చేసింది కూడా ఏమీలేదని ఇక్కడి ప్రజలు చర్చించుకుం టున్నారు. ఇక, నియోజకవర్గం విషయా న్ని చూస్తే.. 1989 నుంచి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు కాంగ్రెస్, మూడు సార్లు టీడీపీ విజయం సాధించాయి. గత ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ నుంచి బరిలో నిలిచిన జర్నలిస్టుగా గుర్తింపు సాధించిన కాల్వ శ్రీనివాసులు హోరా హోరీ పోరును ఎదుర్కొన్నారు.
ఇక్కడ బలమైన నాయకుడుగా ఉన్న కాపు రామచంద్రరెడ్డిపై పోటీ చేసిన ముక్కీ మూలిగీ చివరి 1800 ఓట్ల మెజారి టీతో విజయం దక్కించుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు నేతల మధ్యే మరోసారి పోరుకు తెరలేచింది. వైసీపీ తరఫున బరిలోకి దిగిన కాపు.. గడిచిన ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉన్నారు. బలమైన కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయారు. నేను న్నానంటూ.. అందరినీ కలుసుకున్నారు. వారి కష్టాలు తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గ్రామాల్లో పాదయాత్ర చేశారు. దీంతో ఇప్పుడు కాపుకే జనాలు జై కొడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కాల్వ ఎలాంటి దూకుడు ప్రదర్శించ లేక పోవడం వంటి కారణాలు.. కాపు రామచంద్రారెడ్డికి ప్లస్గా మారాయి. మొత్తానికి అనంతపురంలో టీడీపీ పోగొట్టుకునే తొలి సీటు రాయదుర్గమే నంటే ఆశ్చర్యం అనిపించినా.. నిజం అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.