జగన్ ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని సాధించేవరకూ వదిలిపెట్టడని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ అన్నారు. వైసీపీ కోసం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె.. తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్ కూడా నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తాడని చెప్పారు. 


ఆమె ఇంకా ఏమన్నారంటే.. జగన్ ఎప్పుడూ జనంలోనే ఉన్నాడు.. ఎప్పుడూ పాదయాత్రలు చేశాడు. ఆనాడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడాడు.. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం ఎన్నోదీక్షలు చేశాడు.. ఎన్నో రోజులు కడుపు మాడ్చుకున్నాడు. జగన్ మాతో గడిపిన కాలం కంటే మీతో గడిపిన కాలమే ఎక్కువ. 

జగన్ తల్లిగా ఓ మాట చెబుతున్నా.. ఆయన ఏదైనా తలచుకుంటే తప్పకుండా సాధిస్తాడు. ఆ లక్షణం నాకు జగన్‌కు ఉంది. అతడి గురించి బాగా తెలుసుకాబట్టి చెబుతున్నా.. ప్రజలకు ఎక్కడ ఏ కష్టం ఉందని తెలిసినా అక్కడకు వెళ్లిపోతాడు..

ఇదే సమయంలో ఆమె చంద్రబాబు విమర్శలను కూడా ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఏ రోజూ బయటకు రాలేదు. ఆ తర్వాత ఎన్నికలప్పుడే వచ్చాను.. రాజశేఖర్ రెడ్డి మనుషులను గెలిపించుకునేందుకే వచ్చాను. జగన్ తరపున మాట ఇచ్చేందుకే నేను ఈరోజు మళ్లీ బయటకు వచ్చానని విజయమ్మ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: