కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశిల్ కుమార్ షిందే అంటే రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఆయనకు ఎంతో పేరు ఉంది. సాధారణంగా పదవి దాహం.. రాజకీయ కాంక్ష తీరనిది అంటారు. ఆ మాటను ఇప్పటి వరకు చాలా మంది నేతలు నిజం చేశారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత సుశిల్ కుమార్ షిందే మాత్రం ఇందుకు విరుద్దం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మహారాష్ట్రలోని షోలాపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, ఎన్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి షిందే ప్రసంగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1970లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన షిందే ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టే కనిపిస్తోంది. 1974లో షోలాపూర్ జిల్లాలోని కర్మాలా అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వసంతరావ్ నాయక్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్కు రాజీనామా చేసిన షిందే.. శరద్ పవార్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో చేరారు.
ఆ తర్వాత కొంతకాలానికే తిరిగి కాంగ్రెస్లో చేరారు. 2003లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. షోలాపూర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ తోడుగా వుంటాయి. ఆయన నాకు అండగా నిలబడతారు’ అని తెలిపారు.