ఆంధ్ర ప్రదేశ్కు "ప్రత్యేక హోదా" సాధన పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవాల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీటైన సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కొద్దిగంటల్లో ముగియనుందనగా కేసీఆర్ ప్రసంగంలో దూకుడు బాగా పెరిగింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్లో జరిగిన టీఆర్ఎస్ సభలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రసంగించారు. "అవును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కు తమ పార్టీ మద్దతిస్తుంది" అని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఎన్నికల ప్రచార సభలో ఏపీ రాజకీయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో 'చంద్రబాబు డిపాజిట్ రాకుండా ఓడిపోతున్నారని ఇక చంద్రబాబు ఖేల్ ఖతం' అని, తాము జగన్ తో కలిసి పనిచేస్తాం అందుకు సంశయంలేదని వ్యాఖ్యానించారు.
*దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ అన్నారు.
*విద్యుత్ సరఫరాలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. ఇవాళ విద్యుత్ ఉంటే వార్త కాదని, విద్యుత్ పోతే వార్త అని ఆయన వ్యాఖ్యానించారు.
*వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలనే డిమాండ్ ఉందని దీనిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో విడుదల చేస్తామని చెప్పారు.
*ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కు తెరాస సంపూర్ణంగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెరాస ఎంపీలు ఇప్పటికే లోక్ సభలో చెప్పారని, ఇక ముందూ సహకరిస్తారని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణానికి అడ్డుపడలేదని చెప్పారు. "ఆంధ్రా ప్రజలు మంచోళ్లే, కొంత మంది రాజకీయ నాయకులే కిరి కిరి చేస్తున్నారు. మనం బతకాలె వాళ్లు కూడా బతకాలె" అని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతో తప్ప ఆంధ్ర ప్రజలతో మనకెప్పుడూ పంచాయతీ లేదు. హైదరాబాద్ నగరంపైనే ఆయన శాపాలు పెడుతున్నారు. డిపాజిట్ కూడా రాకుండా చంద్రబాబు ఓడిపోతున్నారు. తెలంగాణలో కచ్చితంగా 16 ఎంపీ స్థానాలు సాధిస్తాం. తెరాస, వైకాపా కలిసి 35 ఎంపీ స్థానాలు సాధిస్తాయి" అని కేసీఆర్ అన్నారు. తెరాస, వైకాపా 35 ఎంపీ స్థానాలు సాధిస్తాయి అని చెప్పారు కేసీఆర్