మచిలీపట్నం.. ఈ స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. చారిత్రకంగా రాజకీయంగా ప్రాధాన్యత కల్గిన ప్రాంతం. ఇక్కడ పోరు చాలా ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల ముచ్చటగా మూడోసారి ఇక్కడ నుంచి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని వైసీపీ ప్లాన్ వేస్తోంది.
ఎంపీ స్థానానికి ఈ సారి 12 మంది పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీ మధ్యనే ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్న జనసేన ఎవరి కొంప ముంచుతుందో అన్న అనుమానాలు తెలుగుదేశం, వైసీపీల్లో ఉన్నాయి.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థి బాలశౌరి గట్టి పోటీ ఇస్తున్నారు. పారిశ్రామిక వేత్తగా పేరున్న శౌరి.. నాలుగోసారి లోక్సభ బరిలోకి దిగారు. స్థానిక సమస్యలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కీలకంగా ప్రచారాస్త్రానికి ఉపయోగిస్తున్నారు.
ఒక్కసారి ఈ సీటు హిస్టరీ చూస్తే.. ఇక్కడ ఇప్పటి వరకూ 16 సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ఆవిర్భావం వరకూ దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎంపీలుగా ఎన్నికవుతూ వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఇప్పటి వరకూ నాలుగుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు.
2009 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కొనకళ్ల నారాయణరావు, కాంగ్రెస్ బాడిగ రామకృష్ణ, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి సి.రామచంద్రయ్యల మధ్య త్రిముఖ పోటీ ఏర్పడగా కొనకళ్ల గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గొల్లు శివరామకృష్ణ, జనసేన నుంచి బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నుంచి గుడివాక రామాంజనేయులతో పాటు ఇతరులు ఏడుగురు పోటీలో ఉన్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.