జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఉన్న బంధం మరో సారి స్పష్టంగా బయట పడింది. 2014 ఎన్నికలకు ముందే పవన్, బాబు మధ్య పెన వేసుకున్న బంధం గత ఐదేళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. మధ్యలో అంతర్గత ఒప్పందంలో భాగంగా ఒకరిపై ఒకరు కావాలని విమర్శలు చేసుకున్నా వీరు మాత్రం లోపల అనుకూల రాజకీయాలు చేసుకుంటూ నెట్టుకొచ్చారు. 2019 ఎన్నికల వేళ ఎన్నికల ప్రచారం ముగిసి మరి కొద్ది గంటల్లో ఎన్నికల ప్రారంభం అవుతున్న టైంలో వీరి బంధం మరో సారి క్లియర్గా బయటపడింది. ఇటు చూస్తే పవన్ పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంతో పాటు విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాక నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను ముందుగా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చెయ్యాలని ప్లాన్ చేశారు. అయితే బాలయ్య చిన్న అల్లుడు పట్టు పట్టడంతో చివరకు అనేక ఒత్తిళ్ల మధ్య విశాఖ ఎంపీ సీటును బాలయ్య చిన్న అల్లుడు భరత్కు ఇవ్వక తప్పలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పిన చంద్రబాబు గాజువాకలో మాత్రం ప్రచారం చెయ్యలేదు. అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ కనీసం రోడ్ షో అయినా చెయ్యాలని చంద్రబాబును ఒప్పించేందుకు విఫల ప్రయత్నం చేసినట్టు టీడీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో పల్లా శ్రీనివాస్ అలిగి సైలెంట్ అయిపోయారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రచారంలో భాగంగా అనేక సార్లు విశాఖకు వచ్చిన చంద్రబాబు పవన్ పోటీ చేస్తున్న గాజువాక వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇక అదే టైమ్లో పవన్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసినా చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంతో పాటు లోకేష్ పోటీ మంగళగిరిలో ప్రచారమే చెయ్యలేదు. పవన్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం భీమవరంలో సైతం తెలుగుదేశం పార్టీ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. దీన్ని బట్టీ చూస్తే ఈ ఇద్దరి మధ్య అంతర్గతంగా ఒప్పందం ఉన్నది ఎవరికైనా ఓపెన్గానే తెలిసిపోతోంది.
ఈ ఒప్పందం మధ్యలో మమ్మల్ని ఎందుకు బలి చేస్తారంటూ భీమవరం, గాజువాకలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు చంద్రబాబుపై గుస్సాతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబును విమర్శిస్తూ వచ్చిన పవన్ నోటిఫికేషన్ వస్తుందన్నప్పటి నుంచే టీడీపీని టార్గెట్ చెయ్యడం మానేశారు. పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడడం ప్రారంభించిన పవన్ తన ప్రచారం మొత్తం జగన్ను కేంద్రంగా చేసుకునే చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అదే టైమ్లో ఇక్కడ అధికార పార్టీ నుంచి సీఎంగా ఉన్న చంద్రబాబును వదిలేసి పొరుగు రాష్ట్ర సీఎం అయిన కేసీఆర్పై విమర్శలు చెయ్యడం విచిత్రమే. చంద్రబాబు సైతం పవన్ను గుర్తు వచ్చినప్పుడు పవన్పై రెండు మాటలు విసరడం మినహా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కేసీఆర్ను విమర్శించడంతోనే ప్రచారం ముగించేశారు. ఏదేమైన ఈ పరిణామాలన్నీ పవన్, చంద్రబాబు మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ని మరో సారి తేటతెల్లం చేశాయి.