ఏపీలో ఎన్నికలు ముగిశాక.. ఎవరికి వారు గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ తమకు 150 సీట్ల వరకూ వస్తాయని చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం గెలుపుమాదేనన్న విశ్వాసంతో ఉన్నారు. మరికొందరు నేతలు ఓ అడుగు ముందుకేసి మంత్రిపదవులపై గురి పెట్టారు.
ఈ నాయకుల్లో నగరి ఎమ్మెల్యే రోజా ముందువరుసలో ఉన్నారు. పార్టీలోజగన్ తర్వాత కీలకనేతగా ఉన్న రోజా తమ పార్టీకి భారీ మెజార్టీ వస్తుందంటున్నారు. తాను నగరి నియోజకవర్గం లోకూడా భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమాగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాడితే కీలక మంత్రి పదవి పై ఆమె కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి అయితే తాను హోం మంత్రి కావడం ఖాయమని ఆమె తమతో కామెంట్ చేసిందని ఓ జాతీయ పత్రిక రాసిన వార్త ఆసక్తి రేపుతోంది. గతంలో రాజశేఖరరెడ్డి హాయంలో సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర హోంమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని రోజా గుర్తు చేస్తున్నారట. ప్రతిపక్షంలో తాను పార్టీ కోసం చేసిన సేవలు జగన్ గుర్తిస్తారని ఆమె అంటున్నారట.
తన వద్దకు వచ్చిన సన్నిహితులతో కూడా రోజా ఇవే వ్యాఖ్యలు చేస్తోన్నట్లు ఆ పత్రిక రాసింది. జగన్ తనకు హోం శాఖ కాకపోతే ఏం ఇస్తారు అని రోజా ధీమా వ్యక్తం చేస్తోన్నట్లు ఆ కథనం చెబుతోంది. రోజా బాటలోనే మరికొందరు నాయకులు కూడా జగన్కు సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తోంది.