వినేవాడు ఆలీ అయితే.. చెప్పేవాడు చిరంజీవి అవుతాడని తరచుగా మనోళ్లు అనుకునే కామెంట్ను ఇప్పుడు నిజం చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఎక్కడాలేని విషయాలన్నీ ప్రజలపై రుద్దేందుకు, వారి నుంచి సానుభూతి పొందేందుకు వీర ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముగిసిన ఎన్నికల్లో ఓటమి అంచుకు ఎంచక్కా చేరిపోయిన టీడీపీ.. కిందపడ్డా పైచేయి నాదేనని నంగనాచి కబుర్లు చెబుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మూడు కోట్ల పైచిలుకు ఓటర్లకు కూడా రాని సందేహాలు, అనుమానాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రమే వస్తున్నాయి. అదేమంటే బాధ్యత గల పార్టీ తనదేనని ప్లేటు తగిలించుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా!
ప్రపంచ యుద్ధం చేసిన తరహాలో చంద్రబాబు ఎన్నికల సంఘంపై మాటల యుద్ధానికి తెరదీశారు. పాపం చేతలకే తప్ప మాటలకు అధికారంలేని ఈసీ.. బాబు వ్యాఖ్యలపై చిద్విలాసంగా వ్యవహరిస్తోంది. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు మంట పుట్టిస్తోంది. తానింతగా గొంతు చించుకుని ఎన్నికల సంఘాన్ని తిడుతుంటే.. ఆ సంఘం మాత్రం మౌన పాత్ర పోషించ డంపై బాబు ఉడికిపోతున్నారు. ఎన్నికలకు ముందుకూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరు పారేసుకున్నా.. ఆయన మాత్రం ఎక్కడా మాట పారేసుకోలేదు. ఇది కూడా బాబును ఉడికించేసింది. దీంతో ఆయన శర పరంపరను ఎన్నికల సంఘంపైకి ఎక్కుపెట్టారు. అయితే, బాబుతో కలిసొచ్చే నాయకుడు కనిపించక ఇబ్బందుల్లో పడుతున్నారు. అయిననూ.,. దేశవ్యాప్తంగా తన పోరు సాగుతుందని నిభాయించి మరీ దండోరా వేస్తున్నారు.
అయితే, బాబు అండ్కోలు చెబుతున్న ఈ పిట్టల దొర కబుర్లన్నీ ఎందుకు? ఇప్పుడు ఎన్నికలు కూడా ముగిసిపోయాయి కదా? అయినా కూడా చంద్రబాబు మాత్రం మహిళలంతా తమతోనే ఉన్నారని,తమ పథకాలకుప్రజలు ఫిదా అయ్యారని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? వంటి ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. వీటికి సమాధానం ఒక్కటే.. సమాధానం కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలకు ఎన్నికల రంగం సిద్ధం కానుంది. ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించమని హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఒకటిన్నర నెల్ల కాలంలోనే మునిసిపాలిటీ, పరిషత్లకు ఎన్నికలు రానున్నాయి. ఇప్పుడున్న హవాలో వైసీపీ దూకుడు కనిపిస్తోంది. వైసీపీ గుండుగుత్తుగా వాటిని తన ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే బాబువారు మాబాగా ఈ పిట్టలదొర ఎపిసోడ్కు రంగం సిద్దం చేసుకున్నారని అంటున్నారు. ఇన్ని చూశాక.. అదిరందయ్యా చంద్రం!! అనకుండా ఉండలేం కదూ!!