జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఆయన ఎక్కడ నుంచి గెలుస్తారు? ఎలా గెలుస్తా రు? ఏ స్థానం నిలబెట్టుకుంటారు? ఆయన వెంట యువత ఉందా? మహిళలు ఉన్నారా? రైతులు ఉన్నారా? వీటన్నింటి కీ మించి సొంత సామాజిక వర్గం పట్టు ఆయనకు ఉందా? అనే చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బెట్టింగులకు కూడా తెరలేచింది. ఎన్నికలకు ముందున్న హడావుడి, ఉత్కంఠ నేటికీ కొనసాగుతున్న తరుణంలో ఫలితం వచ్చేందుకు కనీసంలో కనీసం నెల రోజులకు పైగానే సమయం ఉన్న నేపథ్యంలో పవన్ గెలుపుపై బెట్టింగుల పర్వం కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో పవన్ రెండు స్థానాలనుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాకల నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం హాట్ హాట్గా మారింది. ప్రతి ఒక్కరూ పవన్ గెలుపుపై నే చర్చించారు. ప్రస్తుతం చర్చిస్తున్నారు కూడా. ఇక, బెట్టింగులు కాసే వారు కూడా భారీగానే పెరిగారు. ఈ రెండు నియోజక వర్గాల విషయానికి వస్తే.. భీమవరం నుంచి పవన్ పోటికి దిగడాన్ని సాహసోపేతమైన చర్యగానే భావిస్తున్నారు. క్షత్రియ వర్గానికి మంచి పట్టున్న ఈ నియోజవర్గంలో పవన్ గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు గతంలో ఇదే జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అధినేత హోదాలో చిరంజీవి పోటీ చేశారు. అయితే, ఆయన ఓటమి చవిచూశారు.
ఇక, ఇప్పుడు పవన్ నేరుగా కాపు వర్గం బలం అంతగా లేని భీమవరం నుంచి పోటీ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపు గుర్రం ఎక్కితే మంచిదే, లేక పోతే.. చిరంజీవి సెంటిమెంట్ కొనసాగినట్టుగానే భావించాలని ఇప్పటికేజనసేన నిర్నయానికి వచ్చింది. అదేసమయంలో విశాఖ జిల్లా గాజువాక నుంచి కూడా పవన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాపులకు కొంతమేర ఓటు బ్యాంకు ఉండడం తెలిసిందే. అదేసమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లాకు కూడా ఎడ్జ్ ఉంది. పల్లాను కోరుకునే ప్రజలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. దీంతో పవన్ ఎక్కడ గెలుస్తాడనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలంటే.. మే 23వరకు వెయిట్ చేయాల్సిందే.