ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి. ప్రత్యేకించి ఈసీకి చంద్రబాబుకూ మధ్య జరుగుతున్న గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటికే ఈసీ చంద్రబాబుకు ఎన్నో షాకులిచ్చింది.
ఇప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు సర్కారుకు షాక్ తగిలింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి మద్దాడ రవిచంద్రను బలవంతంగా సెలవుపై పంపారని తెలుస్తోంది. సెలవుపై పంపారా లేక ప్రభుత్వ వర్గాలలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆయనే భయపడి సెలవు పెట్టారా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.
కానీ సదరు రవిచంద్ర మాత్రం ఈ నెల 22 నుంచి వచ్చే నెల 17 వరకూ సెలవు పెట్టారు. ఆర్ధిక శాఖ కార్యదర్శిగా మద్దాడ రవిచంద్ర నియమించినప్పటి నుంచి జరిగిన ఆర్ధిక లావాదేవీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిశీలించారట. అందులో అనేక అవకతవకలు కనిపించాయట.
గత ఐదేళ్లలో చంద్రబాబు జైకా, ప్రపంచ బ్యాంకు, హడ్కోలాంటి సంస్థల నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకువచ్చారు. కానీ ఈ నిధులను ఉద్దేశించిన పనులకు కాకుండా కేవలం వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు వినియోగించారని విచారణలో తేలిందట. ఇదే విషయాన్ని రవిచంద్రను ప్రశ్నిస్తే.. అంతా ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారమే తాను నడుచుకున్నాని చెప్పారట.
అంతే కాదు..రవిచంద్ర ఆర్థిక విషయాలపై అడ్డగోలుగా జీవోలు ఇచ్చినట్టు కూడా వెలుగుచూసిందట. ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా దర్యప్తు చేస్తే క్విడ్ ప్రోకో తరహా లొసుగులు బయటపడవచ్చని.. అదే జరిగితే .. రవిచంద్రతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నట్టే భావించాలి.