తెలంగాణలో ఇప్పటికే ఒక్కో పార్టీని భూస్థాపితం చేసుకుంటూ వస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పడు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ను కూడా ఎలాంటి కనికరం లేకుండా భూస్థాపితం చేస్తున్నారు. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. డీకే అరుణ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు సైతం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిపోయారు. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కూడా ఇప్పటికే కారెక్కేశారు. ప్రస్తుతం ఈ కాంగ్రెస్కు కేవలం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వీరిలో ఓ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైపోయారు అన్న వార్త తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా మిగిలిన 9 గురిలో నలుగురు పార్టీ మారితే అప్పుడు టీ కాంగ్రెస్కు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. తాజాగా హస్తం పార్టీకి షాక్ ఇచ్చి కారెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతున్న వారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మరో కీలక ఎమ్మెల్యే సైతం గులాబీ నేతలతో టచ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే దయనీయ స్థితిలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్కు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా షాక్ ఇస్తే ఆ పార్టీ అసెంబ్లీలో కనీసం ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించ లేనంత దయనీయ స్థితికి దిగజారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోతే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం ఐదుకు పడిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినట్లు అవుతుంది.అప్పుడు కాంగ్రెస్ కంటే ఏడుగురు ఎమ్మెల్యేలతో మజ్లిస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో కి వస్తుంది.ఇక తాజాగా పార్టీ మారుతున్న నలుగురు ఎమ్మెల్యేలు ఈనెల 26న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది