రాజ్యాంగంలోని మూడు స్థంబాల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థ ఇప్పుడు శాసన నిర్మాణ వ్యవస్థ చేతుల్లో చిక్కి గిలగిల కొట్టుకుంటుంది. శాసన నిర్మాణ వ్యవస్థలొంచి పుట్టిందే ప్రభుత్వం. ప్రభుత్వ అధినేతల వత్తిడి దౌర్జన్యం లేదా ప్రలోభాలకు అంతకు మించి సామాజిక వర్గం మొదలైన బలహీనతలకు లొంగి బానిసత్వ పనులు చేయటం వలననే కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యమై పోతుంది అన్నదానికి పెద్ద ఉదాహరణ ఏబి వెంకటేశ్వరరావు మరియు అనిల్ చంద్ర పునేఠా.
ఏపీలో ఈ నెల 11న జరిగిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు కొద్ది రోజుల ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటిలో ఒకటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆ పదవి నుంచి తొలగించిన ఎన్నికల సంఘం పోలింగ్ దగ్గరపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠాను కూడా ఆ పదవి నుంచి తప్పించింది. పలితంగా ఆ ఇద్దరు అధికారులు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అంతే కాదు తమ సహచరుల్లోను సమాంలోను తమ ప్రతిష్ట కోల్పోయారు. జనం దృష్టిలో ఎవడో ఒక నాయకునికి చంచా గిరి చేసి బ్రతికి న పోయిన అధికారులుగా మిగిలిపోతారు. ఒక ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఈ స్థాయికి ఐదేళ్ళ ప్దవిలో ఉండే రాజకీయ నాయకులకు లొంగిపోయి వారికి అనుకూలంగా పనులు చేయటం వీరి మానసిక దుస్థితికి నిదర్శనం.
ఇప్పుడు ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది కదా! మరి వీరిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలాంటి బాధ్యతల్లో ఉన్నారు? అసలు వీరు వీరి కార్యాలయాలకు వస్తున్నారా? అన్న ప్రశ్నలు అందరికి ఆసక్తి రేకెత్తించేవే కదా!
ఏబీ వెంకటేశ్వరరావుని బదిలీ చేసిన సందర్భంగా ఆయనను 'రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం' లో రిపోర్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నఅనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసిన ఈసీ, ఆయన ను 'సాధారణ పాలన శాఖ' కు రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు అయితే ఇవ్వలేదు. ప్రధాన కార్యదర్శి ఉద్యోగం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్న ఈసీ, ఆయన భవిష్యత్తు పోస్టింగ్ పై మాత్రం ప్రస్తావించలేదు.
అప్పటిదాకా తాను కూర్చున్న ప్రధాన కార్యదర్శి స్థానంలో ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూర్చుని ఉన్నారు. పునేఠాకు మరో పోస్టింగేమీ ఇవ్వలేదు. దీంతో పునేఠా ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో? కూడా తెలియని పరిస్థితి. మొత్తంగా ఆయన పరిస్థితి గాల్లో దీపం పెట్టినట్లుగానే ఉంది. ఇక డీజీపీ కార్యాలయం లో రిపోర్ట్ చేయమని చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావుకు కూడా ఇప్పుడప్పుడే పోస్టింగ్ దక్కే పరిస్థితి లేదు.
దీంతో ఆఫీసుకు వెళ్లేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకి అవకాశం ఉన్నా, ప్రత్యేకమైన పోస్టింగ్ అంటూ ఏదీ లేకపోవడంతో ఆయన కూడా పునేఠా మారిదే గాల్లో ఉన్నట్లుగానే లెక్క. ఎన్నికల ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం కొలువుదీరే దాకా వీరిద్దరి పరిస్థితి ఇంతేనన్న వాదన వినిపిస్తోంది.
ఇదీ రాజకీయ నాయకులు అంటే 'శాసన నిర్మాణ వ్యవస్థ' పంచన చేరిన అధికారులు వారి 'కార్యనిర్వాహక వ్యవస్థ' కుప్పకూలి పోయేలా చేయటం ఏ మాత్రం సమంజసం కాదు. న్యాయ వ్యవస్థ తో కలిపి ఈ మూడు వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసిన నాడే రాజ్యాంగ పునాదులపై ప్రజాస్వామ్యం పనిచేసినట్లు. లేకపోతే మనకు ప్రజాస్వామ్య అవసరం ఉండనే ఉండదు. ఎందుకంటే ఏపి ముఖ్యమంత్రి కోరేది ఆయన మాట వినే వెన్నుపూస లేని రాజ్యాంగ వ్యవస్థ.