ఏపీ సీఎం చంద్రబాబు.. తననుతాను సీనియర్గా, ఫార్టీ ఇయర్స్ అనుభవమున్న నాయకుడిగా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తన లాంటి సీనియర్ నాయకుడు లేడని చెప్పుకోవడంలోనూ ఆయన ముందున్నారు. నిజానికి 2014లోకూడా ప్రజలు విభజనతో ఇబ్బందల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డుకు చేరుస్తారని భావించి చంద్రబాబుకు పట్టం కట్టారు. అప్పటికే హోరా హోరీగా వైసీపీ ప్రచారంలో దూసుకుపోయినా.. చంద్రబాబు సీనియార్టీని నమ్మిన మధ్యతరగతి ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఎన్నికల్లో టీడీపీకే పట్టం కట్టారు. దీంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమని అనుకున్నారు. ముఖ్యంగా విభజన కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా రాష్ట్రం బయట పడుతుందని అనుకున్నారు. అఖండ మెజారిటీతో చంద్రబాబుకు అధికార పగ్గాలు అప్పగించారు.
కట్ చేస్తే.. ఐదేళ్లు పూర్తయ్యాయి. ఏపీలో మరోసారి అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. మరి ప్రజలు ఎంతో అనుభవముందని నమ్మిన చంద్రబాబు ఏపీకి చేసింది ఏంటి? ఇప్పుడు ఏపీ ఏ పరిస్థితిలో ఉంది? ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వంటి కీలక విషయాలపై దృష్టి పెడితే.. మొత్తం నాకించేశారనే వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల నుంచి ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల నుంచి కూడా భారీగా వినిపిస్తోంది. కేంద్రం నుంచి నయానో భయానో తెచ్చుకో వాల్సిన నిధుల విషయంలోనూ, ప్రత్యేక హోదా విషయంలోను, అమరావతి నిర్మాణానికి సంబంధించిన నిధుల విషయంలో చంద్రబాబు చేసిన దొంగాటకం ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే వాదన ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కనీస ఖర్చులకు కూడా రాష్ట్ర ఖజానాలో రూపాయి లేని పరిస్థితి ఇప్పుడు తలెత్తిందనే విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది.
ముఖ్యంగా వచ్చే నెల వేతనం కోసం, ప్రధానంగా వేసవి సెలవులు, కొత్త స్కూళ్లు, కాలేజీల్లో తమ పిల్లలను చేర్చాలని చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమకు వచ్చే వేతనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, తాజాగా ప్రబుత్వం మాత్రం నిధులు లేవని, ఖజానా ఖాళీ అయిపోయిందని చూచాయగా వెల్లడించడంతో ఒక్కసారిగా ఉద్యోగ వర్గాల్లోనూ ఆందోళన ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబుకు భజన చేసిన ఉద్యోగ సంఘాల నేతనలు నిలదీసేందుకు ఉద్యోగస్తులు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఎంత తెలివిగా ప్లాన్ చేశారంటే అటు ఎన్నికలు ముగిశాయి... ఇటు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని .. చంద్రబాబుకు అధికార పగ్గాలు ఇవ్వడం .. పేనుకు పెత్తనం ఇచ్చిన చందంగా మారిపోయిందని లబోదిబో మంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగులు ఆందోళనలకు కూడా సిద్ధమవుతున్నట్ట తెలుస్తోంది. ఎలా చూసుకున్నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు.. రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశారని అందరిలోనూ ఆగ్రహం వ్యక్తమవుతుండడం గమనార్హం. అటు మోడీతో పెట్టుకోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి హామీల పరంగా రావాల్సిన నిధులు కూడా రాకుండా పోయాయి. కేంద్రంతో అధికారం పంచుకున్న 40 ఇయర్స్ బాబుకు వారిని మచ్చిక చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా చేతకాలేదన్న విమర్శలే మేథావుల నుంచి వినిపిస్తున్నాయి.