ఏపీ సీఎం చంద్రబాబు తన ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. నిన్నటి వరకు ఎక్కడో మూల గెలుస్తామన్న నమ్మకం కాస్త రోజులు గడుస్తున్న కొద్దీ సడలిపోతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు పార్టీ ఏంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సైతం గెలుపు పట్ల నైరాశ్యమే కనపడినట్టు తెలుస్తోంది. మాట మాట్లాడితే పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే గొప్పలు పోయే చంద్రబాబు ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ను అస్తవ్యస్తం చేశారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత ఇలా ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిలువునా మోసం చేశారు అన్న అభిప్రాయమే అందరిలోనూ ఉంది. గత ఎన్నికల హామీల్లో ఒకటి అయిన నిరుద్యోగ భృతిని కేవలం మూడు నెలల నుంచి మాత్రమే ఇవ్వడం ప్రారంభించారు. అది కూడా గత ఎన్నికల్లో రెండు వేలు ఇస్తాను అన్న చంద్రబాబు ఇప్పుడు కేవలం వెయ్యి మాత్రమే పరిమితం చేశారు. అందులోనూ లెక్కలేనన్ని కొర్రీలు కూడా ఉన్నాయి.
గత ఆరేడు నెలల క్రితమే ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు చివరిలో ఎన్నికల అస్త్రంగా పసుపు కుంకుమ పేరుతో సరికొత్త డ్రామాకు తెరతీశారు. 1999 ఎన్నికల్లో సైతం మహిళలను తానే అభివృద్ధి చేశానని... మహిళాభ్యుదయం తన వల్లే సాధ్యమైందని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు తాజా ఎన్నికల్లో గెలిచేందుకు మరోసారి మహిళలు సెంటిమెంటును అడ్డుపెట్టుకున్న వైనం ఆయన ప్రచారంలోనే స్పష్టంగా కనబడింది. కేవలం చంద్రబాబు సెంటిమెంట్లను నమ్ముకొని ఎన్నికలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ సెంటిమెంటు, నమ్మకాలు ఎంతవరకు పనిచేస్తాయో ? తెలుసుకునేందుకు ఇంకా ఖచ్చితంగా 30 రోజులు టైం మాత్రమే ఉంది. వాస్తవంగా చూస్తే గత ఎన్నికల్లోనే చంద్రబాబు ఇంటికి వెళ్లి పోవాలని ఉంది. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు అనేక లక్కులు కలిసి వస్తే ఇటు జగన్మోహన్రెడ్డికి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా మైనెస్లు ఒకదానికి ఒకటి తోడు అయ్యాయి.
గత ఎన్నికల్లో రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న నరేంద్ర మోడీ వేవ్ ఏపీలో చంద్రబాబుకు చాలా ప్లస్ అయింది. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువత, మధ్య తరగతి ప్రజలు అందరు మోడీ వేవ్తో ఊగిపోయి బిజెపితో పొత్తు ఉన్న చంద్రబాబుకు ఓట్లు వేశారు. అదే టైంలో ఇప్పుడు అప్పటి ఎన్నికలతో పోలిస్తే గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. పవన్ సైతం టిడిపికి సపోర్ట్ చేయడంతో చంద్రబాబుకు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు సీఎం పీఠం చేతుల్లో వాలిపోయింది. ఇక జగన్ గత ఎన్నికల్లో సీఎం కుర్చీకి దూరం కావటానికి చాలా వరకు అనుభవరాహిత్యం ప్రధాన కారణం. గత ఎన్నికల్లో వైసీపీ నాయకత్వం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండటం కూడా ఒక లోపమే.
గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్లస్ అయిన ప్రతి ఒక్కటి మైనస్ గా జగన్ కు చాలా సానుకూల అంశాలుగా కలిసి వచ్చాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు చేష్టలు, ఢిల్లీ పర్యటనలో, ఎన్నికల సంఘంపై ఆక్రోశం, అక్కసు అటు మోడీని టార్గెట్ చేయడం, ఇటు కెసిఆర్పై విమర్శలు చేయడం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు ఓటమికి సాకుల మీద సాకులు కనిపిస్తోంది. ఇక చంద్రబాబు మరోసారి ఈవీఎంలపై తన కోపాన్నంతా చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈవీఎంలతో ఆయన గెలిచి సీఎం అయ్యారు... ఇప్పుడు అవన్నీ మర్చిపోయినట్టున్నారు. పైన చెప్పుకున్న వాళ్ళందరూ తనను ఓడించేందుకు కుట్రలు ప్లాన్ చేశారు అంటున్న చంద్రబాబు చివరకు ఈవీఎంలపై సైతం విరుచుకు పడుతున్నారు అంటే ఆయన ఎంతలా డిఫెన్స్లోకి వెళ్లిపోయారో తెలుస్తోంది. బాబు గెలిస్తే తాను గెలిచినట్టు... తాను ఓడిపోతే చివరకు ఈవీఎంలు కూడా కుట్ర చేసినట్టే కదూ..! ఇక రేపటి ఎన్నిక ఫలితాలే బాబుకు ఫైనల్ షాకేమో ..!