అవి 1990 ముందు రోజులు:
ప్రతి ఎన్నికలకు లౌడ్ స్పీకర్ల హోరు
ఇళ్ల గోడల మీద రాజకీయపార్టీల ప్రచారం
అభ్యర్థులు తమకు నిర్దేశించిన మొత్తం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వ్యయం చేసేవారు
పోలింగ్ రోజున రౌడీల స్వైర విహారం
బూత్ ల్లో చొరబడి భారీగా రిగ్గింగ్ చేసేవారు.
అయితే 1990 డిసెంబరు 12న కేంద్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారిగా "తిరునెల్లయ్ నారాయణ్ అయ్యర్ శేషన్ — టీఎన్ శేషన్" బాధ్యతలు చేపట్టిన కొన్నిరోజులకే మొత్తం దృశ్యం మారిపోయింది. అప్పటివరకు ఎదురు లేని అక్రమార్కులకు కళ్లెం పడింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రిగ్గింగ్ జరగ లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు ఊరుకునేవారు కాదు. వెంటనే జోక్యం చేసుకునేవారు. ఒక అధికారి తన విధులను సక్రమంగా నిర్వహిస్తే సత్ఫలితాలు ఎలా ఉంటాయో రుజువు చేశారు టీఎన్ శేషన్. 1990 నుంచి 1996 వరకు ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యత లు నిర్వహించిన శేషన్ భారత ఎన్నికల చరిత్రపై తనదైన ముద్రవేశారని చెప్పవచ్చు.
టిఎన్.శేషన్ - చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా భారత ఎన్నికల వ్యవస్థ లో సమూల మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే సమూలం గానే కాదు ఆమూలాగ్రం పూర్తిగా మార్చేశాయి అంతేకాదు చిచ్చర పిడుగులైన రాజకీయ నాయకులకు సైతం సిమ్హస్వపనంగా ఉంటూ ముచ్చెమటలు పట్టించారు. 1989నాటికి కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం 10వ భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ గా టిఎన్.శేషన్ బాధ్యతలు చేపట్టారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇన్ని విశేష అధికారాలు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పిన తొలి వ్యక్తి శేషనే. అంతకు ముందు ఎన్నికల సమయంలో “ఎలక్షన్ కోడ్” ఇష్టాను సారంగా ఉల్లంఘించిన చాలామంది శేషన్ సీఈసీ గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో మాత్రం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు సాహసం చేయలేకపోయారు.
నేడు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆయన హయాంలో కాని ఎవరైనా చేసి ఉంటే రాజ్యాంగ వ్యవస్థల చట్రం లో చట్టప్రకారం అభిశంసనకు గుఱిచేసి ఉండేవారు.
ఎన్నికల నిర్వహణ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు ఆయన అనేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమావళిని అధికారులు, రాజకీయ పార్టీలు కచ్చితంగా పాటించేలా చేశారు. అర్హత ఉన్న వారందరికీ “ఓటర్ ఐడీ కార్డు” అందటం ఆయన వర ప్రసాదమే. ఆయన ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి నియంత్రణ విధించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్ పెట్టడంలో పూర్తిగా విజయవంతం అయ్యారు.
ప్రభుత్వ సిబ్బందిని అభ్యర్థుల ప్రచారానికి వాడుకోవడాన్ని నిషేధించారు శేషన్, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్-స్పీకర్లు ఉపయోగించ కూడదనే నియమం ఏర్పరచి దానిని వెరవకుండా అమలుచేసి చూపిందీ ఆయనే. ప్రజాస్వామ్యంలో “ఓటుకు ఇంత విలువ ఉంటుందా!” అనేది ప్రజలకు బాగా తెలిసింది శేషన్ హయాంలోనే. శేషన్ అందించిన సేవలకుగాను 1996 లో ఆయన్ని ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె అవార్డు వరించింది.
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నుముక. అన్ని రాజకీయ వ్యవస్థలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నికల ద్వారా ఏర్పడినవే. ఆ విధంగా దేశంలో ప్రజాస్వామ్యం మరింత ఊపందుకునేలా చేయడంలో ఎన్నికలు ప్రధాన సాధనం అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు జరిగేది మనదేశ 17వ లోక్ సభకు ఎన్నికలు. దీంతో భారత పార్లమెంటులోకి లోక్ సభ, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహించేది భారత ఎన్నికల సంఘం.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య కార్యక్రమం భారత ఎన్నికల నిర్వహణ కావడం ప్రాధాన్యమైన అంశం. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి ఐదేళ్ళ కొకసారి వచ్చే కుభమేళా ఉత్సవం. ఈ ఎన్నికల్లో 900 మిలియన్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 15 మిలియన్ల మంది ఓటర్లు లోక్-సభకు 543 మంది సభ్యులను ఎన్నుకునేందుకు తొలిసారితా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్లలో లోక్-సభ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్రాల శాశనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ మొత్తం బృహత్తర ఎన్నికల కార్యక్రమాన్ని శాంతి, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడం భారత ఎన్నికల సంఘానికి పెద్ద సవాలు. భారతదేశ రాజ్యాంగంలోని విలువలు, అది ఇచ్చిన స్ఫూర్తితో విసిరే సవాల్లతో ఈ కార్యక్రమాన్ని భారత్ అత్యంత నిబద్ధతతో నిర్వహించనుంది. గతంలో నిర్వహించింది.
భారత ప్రజాస్వామ్య ఎన్నికల్లోని ప్రత్యేకత ఏమిటంటే మొత్తం ఎన్నికలు ఎలక్ట్రానిక్ ప్రక్రియ లో ఓటింగ్ మిషన్ల ద్వారా జరుగుతాయి. నిజం చెప్పాలంటే రెండు దశాబ్దాల క్రితమే ప్రపంచ ప్రజాస్వామ్యాలకు ఆదర్శ ప్రాయంగా పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్ ని వాడి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, శక్తివంతంగా భారత్ నిర్వహించింది. దీనివల్ల బ్యాలెట్ పేపర్ల గల్లంతు, రిగ్గింగ్ వంటివి పూర్తిగా పోయాయి. ఈ క్రెడిట్ భారత్ మాజీ ఎన్నికల సంఘ కమిషనర్ టిఎన్ శేషన్ కు వెడుతుంది. 1991-1996 ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా శేషన్ తనదైన ముద్రను ఎన్నికల నిర్వహణలో వేశారు దాన్ని నేడు చంద్రబాబు లోపభూయిష్టమంటున్నారు.
ఎన్నికల నిబంధనావళి అమలులో కూడా టిఎన్ శేషన్ జాతికి నేడు ప్రధాన స్ఫూర్తి. ఎన్నికల సంఘానికి రాజ్యాంగంలోని 324వ అధికరణం విశిష్టమైన అధికారాలను ఇచ్చింది. రాజ్యాంగ బద్ధమైన అధికారాలతో శేషన్ ఎన్నికల సంఘం రబ్బర్ స్టాంప్ కాదు అని ఋజువు చేశాడు. దేశ ఎన్నికల వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.
*తమ పేర్లను నమోదు చేసుకున్న ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులను మంజూరుచేశారు.
*ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు విధించారు.
*ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా శేషన్ ఎంతో కఠినంగా వ్యవహరించారు.
*ఓటర్లకు లంచం ఆశ చూపడం, భయపెట్టడం, వారికి అక్రమంగా లిక్కర్ పంపిణీ చేయడం నిలిపేశారు
*ఎన్నికల ప్రచారాలకు అధికార యంత్రాంగాన్నివినియోగించడంపై,
*మతపరమైన ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం వంటి వాటికి అడ్డుకట్టవేశారు.
*అంతేకాదు లిఖిత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం,
*అధిక స్థాయిలో ధ్వని కాలుష్యం సృష్టించే వంటి వాటిని ఎన్నికల ప్రచారంలో చోటుచేసు కోకుండా కఠినంగా కట్టుదిట్టం చేశారు.
శేషన్ తర్వాత వచ్చిన ప్రధాన ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికల నిర్వహణలో ఆయన ప్రవేశ పెట్టిన నిబంధనలను, నియమావళిని మరింత శక్తివంతం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకునే అవకాశం లేకుండా నియంత్రించారు.
*పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టి ఎన్నికల సంఘం ప్రధానిగా డా. ఎం.ఎస్. గిల్ కూడా శేషన్ ప్రవేశ పెట్టిన నిభంధనలను మరింత కట్టుదిట్టం చేసి ఎన్నికల్లో మోసాలకు తెరదించారు. టి.ఎన్. శేషన్కు మల్లే తనదైన విస్సష్టమైన విజన్ తో పాటు ఎంతో కష్టపడ్డం ఆయన ప్రత్యేకతలు. విజయవంత మైన ఎన్నికల ప్రధాన అధికారిగా పద్మ విభూషణ్ అవార్డు సైతం డా. ఎం.ఎస్. గిల్ ను వరించింది.
నాటి రాజకీయ దిగ్గజాలైన పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయీ, దేవే గౌడ, మూలాయం సింఘ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్, జ్యోతిబసు, ఎంజిఆర్, కరుణానిధి, ఎన్ జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్ లాంటి వారు ఆయన ప్రభావానికి తలొగ్గినవారే. టిఎన్ శేషన్ ను ఎన్టీఅర్ అభినందించారు కూడా!
వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరిపై ఆయన ప్రభావం పెద్దగా పడలేదు. అదే జరిగి ఉంటే ఇప్పుడు ఎన్నికల సంఘం పట్ల చంద్రబాబు తీరు ఇలా ఉండేది కాదు.
1990ల నుంచీ భారత్ ఒక్కటే తన ఎన్నికల వ్యవస్థను మరింత బలోపేతంగా, ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దుతూ వస్తున్న దేశం అని చెప్పాలి. రోజు రోజుకు ఎన్నికల వ్యవస్థను మరింత పటిష్టం చేసిన క్రెడిట్ కూడా భారత దేశానిదే. ఎన్నికల సంఘం చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అక్రమాలకు తావు లేదనే విషయాన్ని రాజకీయ పార్టీలు, ప్రజల మనస్సుల్లో ఇంకేలా 2017 జూన్లో బహిరంగ ‘హాకథాన్’ను సైతం భారత ఎన్నికల సంఘం నిర్వహించింది.
మీడియాతో పాటు మొత్తం ప్రపంచం ముందు ఇవిఎంలు టాంపర్-ప్రూఫ్ మెషీన్లు గా నిరూపించింది. మొదటిసారి ఓటర్ వెరిఫెయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి)ని కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా తమ ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా? లేదా? అన్న విషయాన్ని ఓటరే స్వయంగా అక్కడ చూసుకోవచ్చు, ఇందులో రాజకీయ పార్టీలకు అభ్యంతరం ఉండకూడదు. అభ్యంతరమేదైనా ఉంటే అది ఓటేసిన ఓటర్లకు మాత్రమే ఉండాలి.
ఈ విధానాన్ని గత ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచీ వివిపిఎటి వినియోగం భారత ఎన్నికల్లో సర్వసాధారణం అయింది. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఒక మిలియన్ వివిపిఎటి లు దేశంలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో వినియోగించనున్నారు. ఎన్నికలు సవ్యంగా, పారదర్శకంగా జరిగేందుకు గాను పది మిలియన్ల పోలింగ్ సిబ్బందిని ఎన్నికల విధి నిర్వహణకు దించుతున్నారు.
అన్నింటికీ మించి, ఏ ఓటరూ నిర్లక్ష్యానికి గురికాకుండా ఉండేందుకు వేల కొద్దీ పోలింగ్ పార్టీలు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో రెండు మూడు రోజులు పర్యటించాయి. దివ్యాంగులైన ఓటర్ల విషయంలో కూడా ప్రధాన ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వారు ఇబ్బంది పడకుండా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు పవిత్ర ప్రజాస్వామ్య ఉత్సవాలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, నమోదు చేసుకున్న ఓటర్లు అందరూ ఎన్నిక ల్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ఈ పండుగ పూర్తిగా విజయవంతమైనట్టు.
వీటిలో ముఖ్యంగా ఓటరు గుర్తింపుకార్డులని చెప్పవచ్చు. దీంతో దొంగ ఓట్లకు అడ్డుకట్ట పడింది. ఎన్నికల సంఘం అంటే రబ్బరు స్టాంపు కాదని విశిష్టమైన అధికారాలు న్నాయని తన సంస్కరణల ద్వారా నిరూపించారు శేషన్. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ఆయన హయాంలో రూపుదిద్దుకుంది. ఎన్నికల్లో వ్యయ నియంత్రణకు పరిశీలకులను నియమించారు. ఎన్నికల్లో మద్యం, ధన, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకున్నారు. రిగ్గింగ్ జరిగిన ప్రదేశాల్లో పటిష్ట భద్రత మధ్య రీపోలింగ్ ను
నిర్వహించే వారు. రిగ్గింగ్కు పాల్పడిన వారిపై కఠినమైన కేసులు పెట్టేవారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నది శేషన్ విధానం. అందుకు తగినట్టుగా వ్యవహరించారు. ఎన్నికల నిర్వహణలో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ఆయన అమలు చేయించారు. ఈ క్రమంలో రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు వచ్చినా లెక్కచేయలేదు. భాజపా అగ్రనేత అడ్వాణీ ప్రసంగం రాత్రి పదిగంటల తర్వాత కొనసాగడంతో అక్కడున్న జిల్లాకలెక్టర్ అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు హెలికాప్టర్లను వినియోగించడాన్ని ఆనాటి అధికార యంత్రాంగం ఈసీ స్ఫూర్తితో సమర్థంగా నియంత్రించగలిగింది. ఇవన్నీ కేవలం ఒక వ్యక్తి స్ఫూర్తి ఆధారంగా జరిగినవి కావడం విశేషం.
టీఎన్ శేషన్ తన విధినిర్వహణలో చండశాసనుడని పేరుంది. సమావేశాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా క్షమించే వారు కాదు. ఆయన కఠినచర్యల ఫలితంగా ఎన్నికల్లో నాడు జరిగే పలు అక్రమాలు తగ్గాయి. రాజకీయ పక్షాల కార్యక్రమాలను నియంత్రించ లేకపోవచ్చు కానీ ఎన్నికలను మాత్రం స్వచ్ఛంగా నిర్వ హిస్తాను అని శేషన్ అనేవారు. రాజ్యాంగంలో ఈసీకి సంబంధించిన విధులను అతిక్రమించినట్టు ఒక్క ఉదంతం చూపినా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని ఆయన అనేవారు.
నాకు పదేళ్లు అవకాశమివ్వండి 'మేరా భారత్ మహాన్' అనేలా మారుస్తాను అని చెప్పేవారు. ఇలా ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టిన టీఎన్ శేషన్ తరహాలో ఎన్నికల సంఘం మళ్లీ కొరడా ఝళిపించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల సరళిని పరిశీలిస్తే ధన ప్రభావం కట్టలు తెంచుకొని ప్రవాహిస్తోంది. ఈసీ దాడుల్లో కోట్లాది ధనం దొరుకుతోంది. ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వీటికి సమర్థంగా అడ్డుకట్ట వేయా లంటే ఈసీ విశ్వరూపం ప్రదర్శించాల్సిందే.