గత నెల 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది..ఏపిలో సైతం పోలింగ్ ప్రశాంతంగా జరిగినా అక్కడక్కడా కొన్ని ఈవీఏంలు మొరాయించాయి. మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు తేదీ ఖరారు చేసింది.
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులో 244వ బూత్, నెల్లూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలో ఇసుకపల్లి 41వ బూత్, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలో 197వ పోలింగ్ బూత్, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించిన ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రాసింది.
ఈ మేరకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 6న ఆయా పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.