సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలపై ముగ్గురు న్యాయమూర్తుల "అంతర్గత కమిటీ దర్యాప్తు" తీరు పట్ల సిట్టింగ్ జడ్జి డివై చంద్రచూడ్ తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫిర్యాదిదారు హాజరు కాకుండా దర్యాప్తును కొనసాగించడం వల్ల అత్యున్నత న్యాయస్థానంపట్ల విశ్వసనీయత దెబ్బతింటుందని జస్టిస్ చంద్రచూడ్ హితవు పలికినట్టు ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రిక పేర్నొన్నది.
ఈమేరకు జస్టిస్ 'ఎస్ఏ బోబ్డే నేతృత్వం లోని అంతర్గత కమిటీకి జస్టిస్ చంద్రచూడ్ లేఖ' వ్రాసినట్టు తెలిపింది. తాను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కార్యాలయంలో పని చేస్తున్నపుడు తనను ఆయన లైంగికంగా వేధించారంటూ మాజీ ఉద్యోగిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో అంతర్గత కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
ఇప్పటికే ఈ కమిటీ ముందు మూడు సార్లు హాజరైన మాజీ ఉద్యోగిని దర్యాప్తు జరుగుతున్న తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇకముందు కమిటీ ముందు హాజరు కాబోనంటూ లేఖ వ్రాశారు. తనకు సహాయకుడిగా న్యాయవాదిని అనుమతించడంలేదని, ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశావంటూ కఠినంగా ప్రశ్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాను హాజరు కానని ఫిర్యాది దారు తెలిపినా దర్యాప్తు కొనసాగిస్తామని కమిటీ వెల్లడించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ఆమె చివరిసారిగా గత నెల 30న కమిటీ ముందు హాజరయ్యారు. ఆ మరుసటి రోజే(మే 1న) చీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ కమిటీ ముందు హాజరై తనపై ఆరోపణల విషయంలో వివరణ ఇవ్వడం గమనార్హం.