భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కి సుప్రీంకోర్టు 'అంతర్గత విచారణ కమిటీ' 'క్లీన్ చిట్' ఇవ్వడం సరికాదని ఆయనపై ఆరోపణలు చేసిన మాజీ సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగిని పేర్కొన్నారు. మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో నిజం లేదని జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ఇవాళ తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కు నివేదిక సమర్పించింది. ప్రత్యేక కమిటీ నిర్ణయంపై ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని స్పందించారు.
జస్టిస్ రంజన్ గొగోయ్కి క్లీన్ చిట్ ఇచ్చారని తెలిసి చాలా నిరాశపడ్డాను. ఎంతో బాధపడ్డాను. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఇటువంటప్పుడే పోతుంది. నాపై జరిగిన వేధింపులకు సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీకి ఇచ్చాను. అయినప్పటికీ నాకు న్యాయం జరగలేదు. సీజేఐని ఇరికించేందుకే నేను ఈ విధమైన ఆరోపణలు చేశారడం సరికాదు' అని ఆమె అన్నారు. ఓ మహిళగా తనకు అన్యాయం జరిగిందన్న ఆమె.. తన న్యాయవాదిని సంప్రదించాక తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.