తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న - కాంగ్రెసేతర, బీజేపీయేతర "ఫెడరల్ ఫ్రంట్" ఏర్పాటులో భాగంగా మరోసారి ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అవుతున్న సందర్భంగా సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ తో కేసీఆర్ భేటీ సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ నెల 13 న ఆయన తమిళ ప్రతిపక్ష నాయకుడు డీఎంకె పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తో భేటీ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడే తెలిసిన సమాచారం ప్రకారం.. కేసీఆర్ - స్టాలిన్ భేటీ ఉండక పోవచ్చునని డీఎంకె వర్గాలు చెబుతున్నాయి. కారణం తమిళనాడులో ఈ నెల 19 న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సిఉంది. ఆ ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ ఇప్పటికే బిజీగా ఉన్నారు. దీంతో కేసీఆర్తో ఈ సారికి భేటీ కుదిరే అవకాశం ఉండక పోవచ్చునని అంటున్నారు.
అంతర్గతంగా నిఘూడంగా స్టాలిన్ ఆలోచన ఏమంటే ఇంతకు ముందు నుంచి కాంగ్రెస్ తో దోస్తీ నెరుపుతూ వస్తున్న స్టాలిన్, కావాలనే కేసీఆర్తో భేటీకి అయిష్టంగా ఉన్నారని వాదన వినిపిస్తోంది.లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న డీఎంకె, భవిష్యత్లోనూ కాంగ్రెస్ వెంట నడవాలనే అనుకుంటోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది స్టాలిన్ లక్ష్యంగా చెపుతున్నారు. అదే విషయాన్ని ఇదివరకు పలుమార్లు స్టాలిన్ తన ఆకాంక్షను పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ను ప్రతిపాదిస్తున్న కేసీఆర్తో ఆయన చేతులు కలపకపోవచ్చు అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇదిలా ఉంటే, పట్టువదలని విక్రమార్కుడు కేసీఆర్ డిఎంకేని స్టాలిన్ ని వదిలేసి త్వరలోనే కర్ణాటక జేడీఎస్ అధినేత సీఎం కుమారస్వామిని, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్, బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మరో మాజీ సీఎం మాయావతి, బెంగాల్ టిఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీలను కలవబోతున్నట్టు సమాచారం.
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని భావిస్తున్న కేసీఆర్, ఢిల్లీని ప్రాంతీయ పార్టీలు శాసించాలని భావిస్తూ జాతీయ పార్టీలను పక్కనపెట్టి ప్రాంతీయ పార్టీలు అంతా ఏకమై సమాఖ్యగా మారి ఫెడర్ఫల్ ఫ్రంట్ ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఎజెండా అంటే కామన్ మినిమం ప్రొగ్రాం ఖరారు చేసుకుని డిల్లిలో అధికారం చేజిక్కించుకోవటానికి ముందుకు వెళ్ళాలన్న ప్రతిపాదనను వారి ముందు పెట్టబోతున్నారు.