అసలే సమ్మర్ సీజన్. ఎండ ఠారెత్తుతోంది. దీనికితోడు పొలిటికల్ ఫీవర్. దీంతో ఈ సమ్మర్ కాస్తా.. పొలిటికల్ సమ్మర్గా మారిపోయింది. గత నెల 11న జరిగిన ఎన్నికలు పొలిటికల్ కాకను భారీ రేంజ్లో పెంచాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తగా సమ్మర్ సెగలకు తోడు పొలిటికల్ ఉక్కపోత కూడా తీవ్రస్థాయిలో కొనసాగుతుండడం గమనార్హం. ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఎన్నికలు హాట్హాట్గా సాగడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్ర బాబు హడావుడి చేస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీపైనా, ఆ తర్వాత ఎన్నికల సంఘంపైనా కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఇక, నిన్న మొన్నటి వరకు కూడా తన కేబినెట్లోనే ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎన్నికల సంఘం సీఎస్గా నియమించడంపై కారాలు మిరియాలు నూరారు. కేంద్రంలోని ఎన్నికల సంఘంపై విమర్శలు సం ధించారు. కట్ చేస్తే.. ప్రధాన విపక్షం వైసీపీలో ఈ తరహా ఆందోళన ఎక్కడా కనిపించలేదు. అటు వైసీపీ అధినేత జగన్ కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ ఎక్కడా కొంచెం కూడా తొందరపడకపోవడం గమనార్హం. ఎన్నికల పోలింగ్ రోజు నాడు మాత్రమే మీడియా ముందుకు వచ్చిన జగన్ తనగెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాము ఖచ్చితంగా 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక, ఆ తర్వాత ఇప్పటి వరకు వైసీపీ అధినేత నుంచి కానీ, నేతల నుంచి కానీ ఎక్కడా ఎలాంటి హడావుడీ కనిపించకపో వడం గమనార్హం. ఇదిలావుంటే, జాతీయ స్థాయిలో కూడా పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో జగన్కే ఏపీలో ఎడ్జ్ ఉందని భావిస్తుండడం గమనార్హం. ఏపీలో హోరా హోరీ పోరు సాగినా కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకి అనుకూల ఓటు బ్యాంకు పోటెత్తిందని సర్వేలు చెప్పాయి. ఇక, సొంతగా జగన్ చేయించుకున్న సర్వేల్లోనూ వైసీపీకి భారీ ఎత్తున ఎడ్జ్ ఉన్నట్టు స్పష్టం కావడంతో పార్టీలోని నాయకులు కూడా సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, టీడీపీలోనూ కొందరు సీనియర్లు కూడా తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. పరిస్థితి అనుకూలంగా ఉంటుందా? ఉండదా? అనే సంశయం మాత్రంవ్యక్తం చేస్తున్నారు.
ఇటు చంద్రబాబులో మాత్రం గెలుపుపై అంత ధీమా లేదన్న చర్చలు కూడా తెలుగు రాజకీయ వర్గాల్లోనే కాకుండా జాతీయ మీడియా వర్గాల్లోనూ చర్చకు వస్తున్నాయి. పలు మీడియా సంస్థల సర్వేలు, అటు జాతీయ మీడియా, మేథావులు చర్చలతో పాటు అటు చంద్రబాబు వ్యవహరిస్తోన్న తీరు సైతం ఏపీలో టీడీపీకి అధికారం కల్లేనా ? అన్న సందేహాలకు తావిచ్చేదిగా ఉందంటున్నారు. మొత్తానికి జగన్లో కనిపిస్తున్న మౌనం, స్థితప్రజ్ఞత వెనుక గెలుపు ధీమా ఉందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.