జార్ఖండ్లోని జంషడ్పూర్లో ఓ మహిళ రుద్రకాళి అవతారమెత్తింది. నకిలీ అవినీతి నిరోధక అధికారిని పట్టుకుని దేహశుద్ది చేసింది. జనం చూస్తుండగానే నడిరోడ్డుపై చెప్పుతో కొడుతూ దుమ్ము దులిపింది.
జంషెడ్పూర్కు చెందిన రాఖీవర్మకు కుటుంబ తగాదాలు ఉన్నాయి. కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో పణీంద్ర మహత్వ్ అనే వ్యక్తి బాధితురాలు రాఖీ వర్మకు ఫోన్ చేసి.. తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కుటుంబ తగాదాలను పరిష్కరిస్తానని హామి ఇచ్చాడు. దీనికోసం 50 వేల రూపాయలు ఖర్చవుతుందని తెలిపాడు. ఆఫీసులో వచ్చి డబ్బులివ్వాల్సిందిగా కోరారు.
అయితే ఈ విషయాన్ని రాఖీవర్మ పెద్దగా పట్టించుకోలేదు. అయితే పణీంద్ర మహత్వ్ ఫోన్ చేసి వేధించడంతో..రాఖీవర్మ నేరుగా అతను చెప్పిన ఆఫీసుకు వెళ్లి అతన్ని నిలదీసింది. అతనో ఫేక్ ఆఫీసర్ అని తెలియడంతో కోపంతో రెచ్చిపోయింది మహిళ. కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చింది. చెప్పుతో కొట్టి దేహశుద్ది చేసింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అసలే కుటుంబసభ్యులతో సతమతమవుతున్న తానూ.. పణీంద్ర మహత్వ్ వేధింపులతో విసిగిపోయానని బాధితురాలు తెలిపింది. 50 వేల రూపాయలు లంచం అడగడంతో అతనో నకిలీ అధికారి అని తెలిసిపోయిందని ఆమె వెల్లడించారు. ఇటు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. గతంలో కూడా అతను ఈ రకంగా కొందరిని మోసం చేశాడని పోలీసులు తెలిపారు.