ఇక ఫలితాలు రాకుండానే జనసేనలో నైరాశ్యం అలుముకుంది. ఈ క్రమంలోనే అప్పుడే ఖర్చు తగ్గించుకునే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. పవన్ను నమ్ముకుని ఎన్నికలకు ముందు కోట్లాది రూపాయలు పెట్టబడులు పెట్టిన వారు ఇప్పుడు వాటిని మూసేయడమో లేదా వదిలించుకోవడమో చేస్తున్నారు. ఈ కాస్ట్ కటింగ్లో భాగంగా 99 టీవీని వదిలించుకోనున్నారట. ఫలితాలు వచ్చాక 99 టీవీ వల్ల జనసేనకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికే యేడాది కాలంగా ఆ ఛానెల్పై అనవసరంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ చేతిచమురు వదిలించుకుంటున్నారు.
ఈ ఛానెల్ను టేకోవర్ చేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి తోట చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్ నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను 99 టీవీని నడపలేనని తోట పవన్కు చెప్పడంతో పవన్ సైతం ఈ ఛానెల్ అమ్మేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఛానెల్ను ఎవరు దక్కించుకుంటారా ? అన్నది చూడాలి. ఇప్పటికే తెలుగు మీడియాలో చాలా పేపర్లు, న్యూస్ ఛానెల్స్ పెద్ద సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
టీవీ—9 వ్యవహారం చూస్తూనే ఉన్నాం.. ఇక 99 న్యూస్ ఛానెల్ను కొనేందుకు మీడియా రంగంతో దగ్గర సంబంధాలు ఉన్న ఓ బడా పారిశ్రామికవేత్త రంగంలోకి దిగినట్టు టాక్. ఇక జనసేనకు 99 ఛానెల్ మాత్రమే కాదు.. ఆంధ్రప్రభ దినపత్రిక కూడా ఉంది. ఈ పత్రికకు చెందిన ముత్తా శశిధర్ కాకినాడ సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఈ పత్రికలో కూడా పవన్ తన వాటాను తన సొంత మనుషులు అనుకున్న వారితో కొనుగోలు చేయించినట్టు టాక్. ఇప్పుడు ఈ వాటాను అమ్ముకుని ఎంతో కొంత సొమ్ము చేసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారని జనసేన ఇన్నర్ టాక్.
ఇక ఎన్నికలకు ముందు జనసేన సైనికులం అంటూ చాలా మంది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నారు. వీరు పవన్, జనసేనకు అనుకూలంగా బాగా పోస్టులు స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు ఈ అక్కౌంట్లు ఎక్కడా కనపడడం లేదు. సోషల్ మీడియాలో జనసేన పోస్టులు బాగా తగ్గిపోయాయి. ఎన్నికలకు ముందు వీటికి స్పాన్సర్ చేసిన పవన్కు సన్నిహితుడైన ఓ నిర్మాత ఇప్పుడు చేతులు ఎత్తేయడంతో ఈ ఫేజ్లు కూడా పట్టించుకునే వారు లేరు. ఇక ఎన్నికల టైంలో హడావిడిగా స్టార్ట్ అయిన ఓ ఛానెల్ కూడా ఇప్పుడు సేల్లోనే ఉంది. పవన్ మీద ఇష్టంలో ఈ ఛానెల్ పెట్టిన ఎన్నారై దీనిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.