ఆవిడ ఓ మంత్రిగారి భార్య.. మంత్రిగారి భార్య అంటే డబ్బుకు కొదువే ముంది.. కానీ ఆమె చూపిన చిల్లరతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆవిడ ఎవరో చెప్పలేదు కదూ.. ఆమె ఆంధ్రా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి భార్య వెంకట కుమారి. 


ఆమె హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలోని టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. సాధారణంగా టోల్‌ గేటు వద్ద మంత్రులు, ఆపై స్థాయి నాయకులకు ఉచితం ఉంటుంది. కానీ ఆ స్టిక్కర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఫ్రీ ఉండదు. 


కానీ మంత్రి గారి భార్య ఈ లాజిక్ మరచిపోయారు.. తాను టోల్ గేటు ఫీజు కట్టేదిలేదని భీష్మించుకున్నారు. అక్కడి సిబ్బంది నిబంధనలు వివరించినా ఆమె పట్టించుకోలేదు.. నేను మంత్రి గారి భార్యను నన్నే టోల్ గేటు ఫీజు అడుగుతారా అంటూ వారితో గొడవపెట్టుకున్నారు.


కానీ ఆ టోల్ గేట్ సిబ్బంది కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. ఉచితం మంత్రిగారికే తప్ప.. ఆ కారు వేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉండదని.. ఫీజు కట్టాల్సిందేనని తెగేసి చెప్పారు. ఎంతసేపు గొడవపెట్టుకున్నా సిబ్బంది వినకపోయేసరికి వారిపై రుసరుసలాడుతూ ఫీజు కట్టేసి అక్కడి నుంచి బయటపడ్డారు మంత్రి గారి భార్య. 



మరింత సమాచారం తెలుసుకోండి: