దేశ వ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు, ఏపీ సాధారణ ఎన్నికల ఫలితాలు ఈ గురువారం వెలవడనున్నాయి. ఏప్రియల్ 11న నుంచి ఏడు విడతల్లో జరిగిన సుదీర్గమైన పోలింగ్ ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ మోత మోగించనున్నాయి. ఇప్పటికే లీక్ అయిన నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏపీలో వైసీపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నట్టు సమాచారం. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే లాంటి టాప్ నేషనల్ మీడియా సంస్థలన్నీ ఏపీలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టబోతున్నట్టు జాతీయ మీడియా సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అధినేతకు కనిష్ఠంగా 95 - 105, గరిష్ఠంగా 115 - 120 అసెంబ్లీ సీట్లతో పాటు 15 - 18 లోక్సభ సీట్లు వస్తాయని నేషనల్ మీడియా సర్వేలో మెజారిటీ సర్వేల్లో తేలినట్టు తెలిసింది. ఇప్పటికే నేషనల్ మీడియా సర్వేలు ఏపీ రాజకీయ వర్గాలకు లీక్ అవ్వడంతో చంద్రబాబు మదిలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ఈ రోజు పార్టీ నేతలతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో మళ్లీ టీడీపీ గెలుస్తుందని తమ పార్టీ కేడర్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ప్రధాని రేసులో లేనంటూనే ఒకప్పుడు ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పాత్రనే తాను టీడీపీ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతుండడంతో వీటిపై చంద్రబాబు స్పందిస్తూ గత ఎన్నికల్లో కూడా కొన్ని నేషనల్ మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ గెలుస్తుందని చెబితే ఇక్కడ టీడీపీ గెలిచిందని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రంలో కూడా కొన్ని నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ గెలుస్తుందని చెప్పే అవకాశం ఉందని కానీ 23న వెలువడే ఫలితాల్లో గెలుపు మాత్రం టీడీపీదే అని చంద్రబాబు ప్రకటించారు. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ మరి కొద్ది గంటల్లో వెలువడనున్న సమయంలో తమ పార్టీ కార్యకర్తలు కౌంటింగ్కు ముందే ఎక్కడ ? డీలా పడిపోతారో అన్న సందేహంతో చంద్రబాబు వారిలో ధైర్యం నూరిపోసేందుకే ఎగ్జిట్ పోల్స్లో తేడా వచ్చినా గెలుపు తమదే అని మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. అదే టైమ్లో గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఫలితాలకు ముందు లగడపాటి రాజగోపాల్తో డ్రామా ఆడించి టీడీపీ సానుభూతి పరులు నిండా మునిగిపోయేలా చేసిన బాబు... ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందే తమ పార్టీ కేడర్ నీరసపడకుండా ఉండేందుకు మరో సారి ముందుగానే నేషనల్ మీడియా ఛానళ్లపై తన అక్కసు వెల్లగక్కినట్టు స్పష్టంగా కనపడుతోంది.