తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విధంగా సత్తాచాటిన అధికార టీఆర్ఎస్ పార్టీ కారు జోరుకు లోక్సభ ఎన్నికల్లో బ్రేక్ పడింది. చివరకు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కారు సారుకు కంగారు మొదలైంది. ఒక్క హైదరాబాద్ లోక్సభ స్థానం మినహా మిగిలిన అన్ని ఎంపీ సీట్లను తామే గెలుచుకుంటామని చెప్పిన కేసీఆర్ సార్కు తెలంగాణ ఓటరు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. మొత్తం 17 ఎంపీ సీట్లలో హైదరాబాద్లో ఎంఐఎం వదిలేస్తే మిగిలిన సీట్లలో టీఆర్ఎస్ కేవలం 8 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
తెలంగాణలో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఏకంగా 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా 3-4 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి చోట్ల బీజేపీ అనూహ్యంగా దూసుకుపోతోంది. చివరకు కరీంనగర్లో కేసీఆర్ కుమార్తె కవిత కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నల్గగొండ, భువనగిరి, చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరధ మహారథులు పోటీలో ఉండడంతో ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ కాస్త గట్టి పోటీ ఇచ్చింది.