ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఘోరమైన ఓటమి మూటకట్టుకున్న జనసేనకు ఊరటనిచ్చే వార్త ఒకటి వచ్చింది. ఆ పార్టీ ఎట్టకేలకు రాత్రి వరకు ఉత్కంఠ రేపటి ఫలితాల్లో ఓ సీటు గెలుచుకుని బోణి కొట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ముందు నుంచి జనసేన గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే రాపాక వరప్రసాదరావు గెలిచి.. జనసేన పరువు నిలిపారు. ఆయన గెలుపుతో ఎట్టకేలకు జనసేనకు ఏపీ అసెంబ్లీలో ప్రాధినిత్యం దక్కినట్లయ్యింది.
ఇక రాపక వరప్రసాదరావు 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి అండదండలతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తాజా ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్కడిగా చరిత్రకు ఎక్కాడు. పార్టీ అధినేత తాను పోటీ చేసిన రెండు స్థానాలు అయిన గాజువాక, భీమవరంలో ఓడినా రాపాక మాత్రం సంచలన విజయం సాధించారు.