ఏపీలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఓ షాక్ అయితే.. ఆ పార్టీ భవిష్యత్ లీడర్గా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులకు పెద్ద పీడకలగా మిగిలిపోయింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్పై 5 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నియోజకవర్గంలోని తాడేపల్లి మునిసిపాలిటీ, తాడేపల్లి రూరల్ మండలాల్లో వైసీపీ ముందు నుంచే ఆధిక్యం చాటింది. కౌంటింగ్ స్టార్టింగ్ నుంచి ఆధిక్యంలోనే ఉన్న ఆర్కే చివరకు 5 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు.
ఈ ఎన్నికల్లో లోకేష్ ఎందుకు ? ఓడిపోయారని ప్రశ్నించుకుంటే అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు తనయుడు, మంత్రి హోదాలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేష్ను ఓడించేందుకు వైసీపీ పక్కాగా వ్యూహాలు వేసింది. లోకేష్ వ్యాఖ్యలను వైసీపీ చాలా తెలివిగా నెగిటివ్గా ప్రచారం చేసింది. చివరకు నియోజకవర్గం పేరు పలకడం కూడా చేతగాని లోకేష్ను ఎలా గెలిపిస్తాం ? అన్నది బాగా వైరల్ అయ్యింది. మంగళగిరిని .. మందలగిరి అనడంతో పాటు తాను ఇక్కడ 5 లక్షల ఓట్లతో గెలుస్తానని చెప్పడంతో లోకేష్ పరువు పోగొట్టుకున్నారు.
లోకేష్ను ఓడించేందుకు తెలంగాణ నుంచి కూడా కొంతమంది నేతల సహాయ సహకారాలు అందాయన్న టాక్ కూడా ఉంది. ఇక లోకేష్ ఇక్కడ పోటీ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఎన్నికలకు మధ్య కేవలం నెల రోజులే ఉంది. ఈ నెలరోజుల్లో ఆయన ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. ఆర్కే పేరు ముందుగానే ఖరారు కావడంతో ఆయన నియోజకవర్గం అంతటా చొచ్చుకుపోయారు. ఇక లోకేష్ ప్రచారంలో కూడా చుట్టూ సెక్యూరిటీ గార్డులతో ప్రచారం చేయడంతో లోకేష్ ప్రజలకు దూరం అన్న టాక్ అక్కడ బాగా స్ప్రెడ్ అయ్యింది.
ఇక లోకేష్ మధ్యలో ప్రచారం వదిలేసి.. ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడం కూడా మైనస్. ఇక లోకేష్ పోటీ చేయడంతో డబ్బులు గట్టిగా పంచుతారని అనుకున్నా... టీడీపీకి పోటీగా వైసీపీ సమానంగా డబ్బులు పంచింది. ఇక ఇక్కడ లోకేష్ ఓటమికి సామాజికవర్గాల సమీకరణలు కూడా కీలకంగా మారాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడ పద్మశాలీ వర్గం వారే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా సీటును టీడీపీ ఆ వర్గానికే ఇస్తామని చెప్పింది.
గత ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన గంజి చిరంజీవి 12 ఓట్లతో ఓడారు. ఈ సారి లోకేష్ గెలిస్తే రాష్ట్రంలో తమ వర్గానికి ప్రాధినిత్యం ఉండదన్న టాక్ వాళ్లు బాగా స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు లోకేష్ గెలిస్తే నియోజకవర్గం వదలరు... మళ్లీ మన వర్గం ఓటర్లు ఇక్కడ గెలవలేం అని ఆ వర్గంలో కొంతమంది అపోహలు క్రియేట్ చేయడంతో వారిలో మెజార్టీ ఓటర్లు ఫ్యాన్ వైపే మొగ్గు చూపారు.