నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా వైసీపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు (గురువారం) విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 11గంటల 55నిమిషాలకు తన ఇంటి నుండి ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియానికి వైఎస్ జగన్మోహనరెడ్డి ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదిక పైకి చేరుకొన్నారు.
వేదికపైకి చేరుకొని స్టేడియం నలువైపులా తిరిగి ప్రజలకు అభివాదం చేశారు. ముహుర్తానికి ఒక్క నిమిషం ముందుగానే ఏపి రాష్ట్ర గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహాన్ దంపతులు వేదికపైకి చేరుకొన్నారు. గవర్నర్ నరసింహాన్ వైఎస్ జగన్మోహనరెడ్డిని ఆలింగనం చేసుకొని అభినందించి ఆయనతో ప్రమాణం చేయించారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి స్టేడియానికి చేరుకోవడానికి ముందే వైఎస్ విజయమ్మ వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు డీఎంకె చీఫ్ స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డీఎంకె చీఫ్ స్టాలిన్ కు వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల, తన తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిని పరిచయం చేశారు. స్టాలిన్ వచ్చిన కొద్ది క్షణాలకే తెలంగాణ సీఎం వేదికపైకి వచ్చారు. స్టాలిన్ ను కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొన్నారు.
వైఎస్ జగన్మోహనరెడ్డితో ప్రమాణం చేయించిన తర్వాత గవర్నర్ నరసింహాన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన డీఎంకె చీఫ్ స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను పలకరించారు. ఆ తర్వాత ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ సభ్యులను గవర్నర్ దంపతులు పలకరించారు. ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన జగన్ను తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకె చీఫ్ స్టాలిన్ లు అభినందించారు.