మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత బిజెపి విస్తరణ కోసం కొత్త ఎత్తులు వేస్తోంది. ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలను పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పలువురు టిడిపి నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ఇటీవలే తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని బీజేపీ నేత గడ్కరీని కలవటం కలకలం రేపింది. ఆయన త్వరలోనే బిజెపిలో చేరవచ్చునని తెలుస్తోంది. అందుకే లోక్సభ విప్ పదవి గురించి బహిరంగంగా తన అసంతృప్తిని ప్రకటించారు.
కేశినేని నాని రాజకీయ కలకలం ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు మరి కొందరు నేతలు కూడా బిజెపి బాట పట్టవచ్చని తెలుస్తోంది.తాజాగా వచ్చిన ఒక కథనం సంచలనంగానే ఉంది. మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి సోదరులు బిజెపిలో చేరే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వారి ఇద్దరి కుమారులు గత ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. తమ కుమారులతో చర్చించిన జేసీ బ్రదర్స్ టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, తిరిగి అధికారంలోకి రావడం అసంభవం అనే అభిప్రాయానికి వచ్చారని, దీంతో తమ వారసులను బీజేపీలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే రామ్ మాధవ్ తో చర్చలు పూర్తయ్యాయట.