తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు పేరు తెలియని తెలుగు వాడు ఉండరు. ఆయనంటే గౌరవం లేని తెలుగు నేల ఉండదు. ఈ నేపథ్యంలో అన్నగారుగా పిలుచుకుని ఆయనకు అమితమైన మర్యాదలు కల్పించింది. ఇక, ప్రభుత్వ పరంగాను ఆయనకు కొంత మేరకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కూడా ఎన్టీఆర్పై అపారమైన ప్రేమను కనబరిచారు. ఎన్టీఆర్ జన్మించిన కృష్ణాజిల్లాలోని గుడివాడ గడ్డకు తొలిసారి మంత్రి పదవిని అందించి ఎన్టీఆర్ ఖ్యాతిని మరింత పెంచారు.
కృష్ణాజిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్.. ఒకసారి గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఆయన పోటీ చేసిన గెలిచిన నియోజకవర్గాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వివిధ రాజకీయ కారణాలతో పక్కన పెడుతూ వచ్చా యి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్..గుడివాడ పరిధిలోకి వచ్చినప్పుడు .. ఈ ప్రాంతానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు.. ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెడతానని సంచల న ప్రకటన చేశారు. మొత్తానికి అప్పట్లోఇచ్చిన హామీని జగన్ ఇప్పటి వరకు గుర్తు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే గుడివాడ నుంచి వరుసగా విజయం సాధించిన కొడాలి నానికి తన మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు జగన్. నానీకి కీలకమైన శాఖనే అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. నానికి మంత్రి పదవి ఇవ్వడంతో గత దశాబ్దంన్నర కాలంగా గుడివాడ నియోజకవర్గంలో జరగని అభివృద్ది ఇప్పుడు నాని చేసుకునే ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో కృష్ణా జిల్లాలోని రెండు పార్ల మెంటు నియోజకవర్గాలను విభజించి.. రెండు జిల్లాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారని అంటున్నారు. ఇదే జరిగితే.. ఎన్టీఆర్ కుటుంబంలో నుంచి కూడా ఎవరూ ఈ రేంజ్లో ఘన నివాళి అర్పించిన వారు ఉండరని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి జగన్ తనదైన పంథాలో దూసుకుపోతున్నా డని చెప్పడానికి ఇది మచ్చుతునక.