ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించడం కేసీఆర్కు చాలా ఆనందం కలిగించింది. ఎన్నికలకు ముందు నుంచే జగన్ గెలవాలని కోరుకున్న కేసీఆర్ ఆ కల నిజం కావడంతో సంబర పడ్డారు. జగన్ ప్రమాణ స్వీకారానికి రంగా విజయవాడ వెళ్లి దగ్గర ఉండి మరీ కార్యక్రమం జరిపించారు.
కానీ కెసిఆర్ లో ఈ ఆనందం ఎక్కువ కాలం ఉండే అవకాశం కనిపించడం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, అసెంబ్లీలో వ్యవహరిస్తున్న వైఖరి కెసిఆర్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆశా వర్కర్ల నుండి హోంగార్డుల వరకు జగన్ జీతాలు పెంచేశారు.
దీంతో ఇక్కడ కెసిఆర్ కూడా జీతాలు పెంచాలని ఒత్తిళ్లు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా అసెంబ్లీలో జగన్ చేసిన ప్రసంగం కేసీఆర్ ప్రత్యర్థులకు వరంగా మారింది. పార్టీ ఫిరాయింపుల తాను ప్రోత్సహించనని.. జగన్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం అందిస్తామన్నారు.
ఇప్పుడు కెసిఆర్ ప్రత్యర్థులు జగన్ ప్రసంగాన్ని కోట్ చేస్తూ కేసీఆర్ తీరును ఎండగడుతూ ఉన్నారు. కెసిఆర్ తనకు తగినంత మెజారిటీ ఉన్నా .. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ఆ పార్టీని విలీనం చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తున్నారు. అతిపెద్ద విమర్శలకు జవాబు చెప్పలేక టిఆర్ఎస్ నేతలు తెగ ఇబ్బంది పడుతున్నారు.