ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వడం శాసనసభ్యుల ప్రమాణస్వీకారాలు, స్పీకర్ ఎన్నిక లాంటి కార్యక్రమాలు సజావుగానే సాగాయి. అయితే గురువారం రెండో రోజు నుంచే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో కొద్ది రోజుల వరకు వైసీపీపై ఎటాక్ ఉండదని అందరూ అనుకున్నారు.
అయితే టీడీపీ స్పీకర్ ఎన్నిక దగ్గర నుంచే వైసీపీపై పసలేని ఎటాక్ చేయడం ప్రారంభించింది. సభలో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు కూడా కనీస సంప్రదాయాలను తుంగలో తొక్కేశారు. అదేంటని ప్రశ్నించిన వైసీపీ వాళ్లపై దాడులు చేయడం ప్రారంభించేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం సమావేశాల మూడోరోజు ముందుగా గవర్నర్ ప్రసంగం జరిగింది.
ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యేలు అయిన సాయి ప్రసాద్ రెడ్డి (ఆదోనీ), బాలనాగి రెడ్డి (మంత్రాలయం) ఎదురయ్యారు. ఈ సందర్భంగా నమస్తే అన్న అంటూ వారిద్దరు చంద్రబాబుకు నమస్కరించడంతో పాటు అప్యాయంగా పలకరించారు. వెంటనే చంద్రబాబు కూడా బాగున్నారా.. అంటూ వైసీపీ ఎమ్మెల్యేలను పలకరించారు. ఇలా అసెంబ్లీ లాబీలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య సందడి వాతావరణం నెలకొంది.